సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజు నుంచే కేటీఆర్ తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, అసెంబ్లీలో తనదైన శైలిలో ప్రసంగిస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 2014 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు.అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. సరిగ్గా ఏడాది కిందట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన కీలక బాధ్యతలు అందుకున్నారు. ఈ ఏడాది కాలంలో ఆయన ఏమేం సాధించారు? ఒకసారి పరిశీలిస్తే..

 

 తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2001లో టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆయన తనయుడు కేటీఆర్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అనతి కాలంలోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. సరిగ్గా పదేళ్ల కిందట, 2009 ఎన్నికలకు ముందు కీలక సమయంలో కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.2018 డిసెంబర్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్.. ఏడాది కాలంలో పార్టీలో తానేంటో నిరూపించుకున్నారు. నెంబర్ టూ స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
 
టీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కేటీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వలేదు. కేటీఆర్‌తో పాటు హరీశ్ రావుకు కూడా మంత్రి పదవి కేటాయించలేదు. ఇది పార్టీలో, రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు కారణమైంది. అయితే.. మంత్రి పదవి లేకపోవడంతో దొరికిన సమయాన్ని కేటీఆర్ సద్వినియోగం చేసుకున్నారు. పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించారు. పార్టీపై క్రమంగా పట్టు సాధించారు. ఇదే సమయంలో అటు హరీశ్ రావుపైనా ప్రజల్లో సానుభూతి పెరిగింది. అయితే.. ఇరువురికీ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు లభించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ వీడింది. పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఫలితాలు రాబట్టారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలోనూ ఘన విజయాన్ని సాధించిపెట్టారు. ఇటు మంత్రిగా, అటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రెండు పదవులను సమర్థంగా నిర్వహిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ దూసుకెళ్తున్నారు.

 

ఏడాది కాలంగా పార్టీ పరంగా, వ్యక్తిగతంగా కేటీఆర్ అనేక విజయాలు సాధించారు. అయితే.. అన్నింటికంటే మఖ్యమైంది ఒక్కటే.. పార్టీలో తానే నెంబర్ టూ అని ఘనంగా చాటుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడని గుర్తింపు సాధించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో సమర్థంగా మాట్లాడగలగటం ఆయనకు అదనపు బలం.

 

కేటీఆర్ త్వరలో మరో సవాల్‌ను ఎదుర్కోబోతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జనవరి ఆఖర్లో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. అంతేకాకుండా కేటీఆర్ మునిసిపల్ శాఖను కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో మరింత ప్రతిష్టాత్మకమైనవి. దీంతో ఈ ఎన్నికల కోసం ఆయన ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ.. దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు రాబడితే.. ఆయన తిరుగులేని నాయకుడిగా ఎదగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.పార్టీలో తానే నెంబర్ టూ అని మరోసారి రుజువు చేసుకోనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: