సీఎం వైఎస్ జగన్ చట్టసభల సాక్షిగా ప్రతిపక్షం విద్యుత్ అంతరాయాలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. ఎప్పుడు అబద్ధాలు చెప్పడమే విపక్షానికి అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. మంగళవారం టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీటుగా ఆయనకు బదులిచ్చారు. ఈ దశలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విపక్ష ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకున్నారు.
సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘గతేడాది కన్నా ఈ ఏడాది మెరుగ్గా ఉందా లేదా అనేది వివరాలతో సహా చెబుతున్నాం ఈ విషయం అందరికి తెలిసిందే . కనీసం ఇది కూడా ప్రతిపక్షం అర్థం చేసుకోవడంలేదు. విద్యుత్ సంబంధించి వాటి యొక్క అంతరాయాల వివరాలు ఎవరికి తెలుస్తాయి.. సంబంధిత మంత్రికి కాదా. మీరు పదేపదే చట్టసభలో అబద్ధాలు మాట్లాడుతుంటే వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే సమాచారం తెప్పించి, సభ ముందు ఉంచాలనే నేను కల్పించుకుని మాట్లాడుతున్నాను’ అని ఆయన అన్నారు.
ఈ సందర్బంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ.. ఇప్పటికే చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగాన్ని సంబంధించి రూ.70వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత ఆయనకే వుంది . అంతేకాకుండా రాష్ట్రంలో విభజన నాటికే మిగులు విద్యుత్ ఉందనే విషయాన్ని వక్రీకరించారన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు అస్సలు విద్యుత్ లైన్లు, ఫీడర్లను పరిశీలించ లేదన్నారు.
కానీ తమ ప్రభుత్వం మాత్రం ఈ పనిచేశామని, దీనివల్ల అక్కడక్కడా వారికీ విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయని తెలియజేసారు . అంతేకాకుండా గతేడాదితో పోలిస్తే ఇప్పుడు తక్కువ ఫీడర్లు, తక్కువ గంటల్లోనే అంతరాయం నమోదైందన్న విషయాన్ని సభ ముందుంచారు. ఈ సందర్బంగా విద్యుత్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, అలాగే 2021 నాటికి మరో 1600 మెగావాట్ల అదనపు ఉత్పత్తి వస్తుందని తెలిపారు.