జాతీయ పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కేంద్రంలోని బీజేపీకి షాకులు తగులుతున్నాయి. అస్సాంలో నిర్వహించిన ఎన్ఆర్సీ తరహాలోనే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే, తాజాగా ఎన్ఆర్సీ బిల్లు సమయంలో సహకరించిన ఓ రాజకీయ పార్టీ బీజేపీకి షాకిచ్చింది. ఎన్ఆర్సీని అమలుచేయబోమని ప్రకటించింది. అలా ట్విస్టిచ్చింది ఒడిశాలోని అధికార బీజేడీ. పార్లమెంట్లో పౌర సవరణ బిల్లుపై ఓటింగ్ సమయంలో ఆ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఆ పార్టీ ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేసింది. చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో పట్నాయక్ ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బీజేడీ రథసారథి, రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంట్లో పౌర సవరణ బిల్లుపై ఓటింగ్ సమయంలో ఆ బిల్లుకు మద్దతు ఇచ్చామని, కానీ తమ రాష్ట్రంలో మాత్రం ఎన్ఆర్సీ చేపట్టమని తెలిపారు. ఎన్ఆర్సీకి బీజేడీ మద్దతు ఇవ్వడం లేదని సీఎం పట్నాయక్ అన్నారు. కాగా, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఒడిశాలో కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రకటన ఆసక్తికరంగా మారింది.
కాగా, ఒడిశాలో అక్రమంగా నివసిస్తున్న వారిలో బంగ్లాదేశీయులు ఎక్కువగా ఉన్నారు. తమ రాష్ట్రంలో చొరబడిన వారిలో సుమారు 4 వేల మంది బంగ్లాదేశీలు ఉన్నట్లు గతంలో ఓ సారి సీఎం పట్నాయక్ అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలో చొరబడిన బంగ్లాదేశీలకు నోటీసులు ఇచ్చారు. అయితే, తాజాగా వారిని చట్టప్రకారం బయటకు పంపే ప్రక్రియకు మాత్రం సహకరించబోమని ఆయన ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
కాగా, అస్సాంలో విడుదలైన సిటిజన్స్ జాబితా నుంచి 19 లక్షల మందిని తప్పించిన విషయం తెలిసిందే. దీంతో వివిధ మతాలకు చెందిన వారు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గుతున్నారు.