భారతదేశ కశ్మీర్ (ఆర్టికల్ 370) అంశంపై ఐరాస భద్రతా మండలిలో చర్చించాలన్న ప్రతిపాదనను చైనా వెనక్కు తీసుకుంది. కశ్మీర్ అంశాన్ని చర్చలో చేర్చినా.. ఐరాస భద్రతా మండలిలో కీలక సభ్యదేశాలు చైనా ప్రతిపాదనను వ్యతిరేకించడంతో దాన్ని ఉపసంహరించుకుంది. భద్రతా మండలిలో తాము సభ్యులుగా లేమని, అలాంటప్పుడు తమ దేశానికి సంబంధించిన అంశంపై ఎలా చర్చిస్తారని భారత్ బలంగా వాదించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. తమది కాని విషయాలలో చైనా జోక్యం చేసుకుంటుందనే భావన మిగతా సభ్యదేశాల్లో వ్యక్తం కావడంతో డ్రాగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. 

 

ఇదే అంశంపై ఫ్రాన్స్ దౌత్య వర్గాలు మాట్లాడుతూ... కశ్మీర్‌ అంశాన్ని భద్రతా మండలిలో చర్చిచబోం.. ఇది ద్వైపాక్షిక అంశం, ఈ విషయంలో తాము స్పష్టమైన విధానానికి కట్టుబడి ఉన్నామని, ఇదే విషయాన్ని అమెరికా కూడా అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందని  తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో జరుగుతోన్న నిరసనలు, ఆందోళనలను మరింత ఎగదోయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తున్న తరుణంలో కశ్మీర్ అంశంపై చైనా వెనక్కు తగ్గడంతో భారత్‌కు కొంత ఉపశమనం లభించింది. 

 

తన చిరకాల మిత్రుడు పాకిస్థాన్‌కు వంతపాడుతూ భారత్‌ను ఇరుకుపెట్టడానికి డ్రాగన్ కుయుక్తులు పన్నింది. అయితే, ఈ ప్రతిపాదనను మిగతా సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఉపసంహరించుకుంది. గతంలో చేసుకున్న ద్వైపాక్షిక సరిహద్దుల ఒప్పందాలపై చర్చించడానికి భారత్, చైనాలు ఈ వారాంతంలో సమావేశం కానున్నాయి. భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా తరఫున విదేశాంగ మంత్రి వాంగ్ యీ హాజరవుతున్నారు. డిసెంబరు 21న ఇరువురి మధ్య సమావేశం జరగనుంది. గత ఆగస్టులో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చైనాలో పర్యటించినప్పుడు సరిహద్దుల అంశంపై చర్చించడానికి చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది. 

 

ఇదే సమయంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాకిస్థాన్, నేపాల్‌లో పర్యటించడంతో సరిహద్దులపై చర్చలకు సరైన సమయం కాదని భారత్ సంకేతాలు పంపింది. అనంతరం చైనా అధ్యక్షుడు జీ జింగ్ పిన్ భారత్‌లో రెండు రోజులు పర్యటించి.. మహాబలిపురంలో ప్రధాని నరేంద్ర మోదీతో రెండోసారి అనధికారికంగా సమావేశమయ్యారు, మొదటిసారి చైనాలోని వుహన్ నగరంలో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: