నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ తనదైన శైలిలో మరోమారు వార్తల్లో నిలిచారు. మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, తన అన్న కుమారుడు అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచిన తర్వాత...విజయవంతంగా ఆ సర్కారును కూలదోసి...శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిన సంగతే. తద్వారా కాంగ్రెస్ పార్టీకి పెద్ద రిలీఫ్ ఇచ్చిన పవార్ తాజాగా ఆ పార్టీకి షాకిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రత్యామ్నాయం ప్రస్తుతం దేశానికి అవసరమని శరద్ పవార్ అన్నారు. అయితే ఆ ప్రత్యామ్నాయం ‘దేశంలోనే ఉండాలని’ వ్యాఖ్యానించారు. తద్వారా రాహుల్ గాంధీకి ఎన్సీపీ అధ్యక్షుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అయితే, దీనికి రాహుల్ వైపే కారణం ఉందంటున్నారు.
దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్న సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారు. సీఏఏపై విపక్షాలు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ను కలిసిన సమయంలో కూడా రాహుల్ గైర్హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో నాగ్పూర్లో విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందిస్తూ.... ‘దేశంలో కొన్ని ప్రాంతాల్లో బీజేపీ వ్యతిరేక పవనాలు పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే అలాంటి మార్పు సాధ్యం కావాలంటే ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం అవసరం. ఆ ప్రత్యామ్నాయం దేశంలోనే ఉండాలి’ అని పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇక పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రపతిని ప్రతిపక్షాలు కలువడంపై పవార్ స్పందిస్తూ.. ఉమ్మడి లక్ష్యంపై బీజేపీయేతర పార్టీలన్నీ చేతులు కలిపినట్లు కనిపిస్తున్నదని, అయితే బీజేపీకి ప్రతిగా ఒక ‘వ్యవస్థీకృత నిర్మాణానికి’ వాటికి కొంత సమయం పడుతుందని ఎన్సీపీ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు లీ నాక్యూన్ను కలిసినట్లు రాహుల్ తెలిపారు.