మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయం తెలంగాణా సిఎం కేసియార్ లో టెన్షన్ పెంచేస్తోంది. ఏపికి మూడు రాజధానులు ఉంటే తప్పేమిటి అంటూ అసెంబ్లీలో జగన్ చేసిన ప్రతిపాదన అందరికీ తెలిసిందే. జగన్ చేసిన ప్రతిపాదన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. జగన్ ప్రకటన వల్ల రాష్ట్రంలో హీట్ పెరిగిపోతోంది అంటే అర్ధముంది. మరి కేసియార్ లో ఎందుకు టెన్షన్ పెంచుతోంది ?
ఎందుకంటే జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదన తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలో మొదలైంది. ఆదిలాబాద్ ఎంపి, బిజెపి నేత సోయం బాబురావు జగన్ డిమాండ్ ను అందుకున్నారు. ఆదిలాబాద్-హైదరాబాద్ మధ్య 300 కిలోమీటర్ల దూరం ఉందట. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రతిసారి జిల్లాలోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ రావాలంటే కష్టంగా ఉందన్నారు.
ఇదే విషయాన్ని తాము ఇప్పటికే కేసియార్ దృష్టికి తీసుకెళ్ళినట్లు కూడా సోయం చెప్పారు. అంటే ఇపుడు చెప్పింది సోయమే అయినా మెల్లిగా బిజెపి ఇదే విషయాన్ని టేకప్ చేయటం ఖాయం. ఒకసారి పార్టీపరంగా ఓ విషయం మీద డిమాండ్ మొదలైతే అదే మెల్లిగా ఆందోళనలుగా మారటం ఖాయం. ఒకపార్టీ ఓ విషయం మీద ఆందోళనలు మొదలుపెడితే అదే ఆలోచన ఉన్న మరో పార్టీ కూడా రంగంలోకి దిగటం పెద్ద విషయం కాదు.
అసలే తెలంగాణాలోని చాలాపార్టీల నేతలకు కేసియార్ అంటే బాగా మంటగా ఉంది. కాబట్టి ఇపుడు ఈ విషయం బిజెపి పరంగా మొదలైతే వెంటనే కాంగ్రెస్, వామపక్షాలు కూడా అందుకుంటాయి. టిడిపి నేతలు మాత్రమే ఎటూ తేల్చుకోలేని పరిస్దితుల్లో ఉంటారన్నది వాస్తవం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం తెలంగాణాలో కేసియార్ పై ఒత్తిడి పెంచేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం డిమాండ్ తో తెలంగాణాలో 59 రోజుల నిరవధిక సమ్మెకు జగన్ నిర్ణయమే కారణం. ఇటువంటి అనేక నిర్ణయాలు కేసియార్ ను ఇరకాటంలో పడేస్తున్నాయి.