ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ రాజధాని విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఏపీ లో సౌతాఫ్రికా మోడల్ తరహాలో 3 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఆయన గతంలో చెప్పారు. అమరావతిలో చట్టసభలు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చని అన్నారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విశాఖపట్నంలో ఇప్పటికే అన్ని వసతులు ఉన్నాయని, ఒక మెట్రో రైలు వేసుకుంటే సరిపోతుందని అన్నారు. 

 

మూడు రాజధానులు ఉండొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అమరావతి రైతుల్లో ఆందోళన పుట్టించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 29 గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలియజేస్తున్నారు. అమరావతి గ్రామాల్లో రిలే దీక్షలు కూడా చేపట్టారు. ఈ గందరగోళం కొనసాగుతుండగానే.. హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్ దాఖలు చేశారు. రాజధానిపై పున: సమీక్షించే అధికారం లేదంటూ హైకోర్టులో రైతుల పిటిషన్ వేశారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములైన తమ హక్కును కాలరాస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు..రాజధాని పరిరక్షణ కమిటీ తరపున రైతుల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

 

ఏపీ రాజధానిని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కొనసాగించేలా.. రాష్ట్రప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించాలని కోరారు. రాజధాని కోసం భమూలు తీసుకొని ఇప్పుడు నిపుణుల కమిటీ వేయడం ఏంటని ప్రశ్నించారు. జీ.ఎన్‌.రావు కమిటీ జీవోను రద్దు చేయాలని పిటిషనర్‌ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ పై హైకోర్టు విచారణ స్వీకరించిన కోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హై కోర్ట్ ఆదేశం ఇచ్చింది.

 

మరోవైపు రాజధానిపై జీఎన్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. మరో వారంలో నివేదికను ఇవ్వనుంది.. నేరుగా ముఖ్యమంత్రి జగన్‌కు అందజేయనున్నారు. కమిటీ రిపోర్టులో ఎలాంటి విషయాలను పొందుపరుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కార్ కూడా ఈ నివేదిక ఆధారంగా రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో.. అందరి చూపు కమిటీ ఇచ్చే నివేదికపైనే ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: