దిశ నిందితుల కుటుంబ సభ్యుల మాట మార్చారు. మొదట నిందితుల్ని ఉరి తీసినా తమకు అభ్యంతరం లేదన్న వారే , ఇప్పుడు తమ పిల్లల్ని పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. దిశ హత్యచార ఘటనలో పాల్గొన్న నల్గురు నిందితుల్నివిచారణలో భాగంగా , పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చటాన్పల్లి తీసుకువెళ్లగా, వారు పోలీసుల చేతిలోని ఆయుధాలను లాక్కుని , కాల్పులు జరిపే ప్రయత్నాన్ని చేశారు.
పోలీసులు ఆత్మ రక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నల్గురు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే పోలీసులు తమ పిల్లల్ని బూటకపు ఎన్ కౌంటర్ చేశారని, పట్టుకుని వెళ్లి కాల్చి చంపారని ఆరోపిస్తూ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేయడం చర్చానీయాంశంగా మారింది. నలుగురు నిందితుల్ని ఉద్దేశ్య పూర్వకంగా కాల్చి చంపి పోలీసులు, ఎన్ కౌంటర్గా చిత్రీకరిస్తున్నారని న్యాయవాదులు సతీష్, కృష్ణమాచారిలు పిల్ దాఖలు చేశారు. కస్టడీలో ఉన్న నిందితుల్ని హత్య చేసినందుకు ఒకొక్క కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారాన్ని అందజేయాలని కోరారు.
అలాగే ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులతోపాటు, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. కోర్టు వేసిన కమిషన్కు ఇచ్చే సాక్ష్యలను తారుమారు చేయకుండా, తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్పై ఇప్పటికే సుమోటోగా కేసు స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టగా , సుప్రీం కోర్టు ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దిశపై అత్యాచార, హత్య ఘటనను తొలుత నిందితుల కుటుంబ సభ్యులు కూడా త్రీవంగా వ్యతిరేకించారు. వార్ని ఏమి చేసినా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చి తమ పిల్లల్ని పోలీసులు అన్యాయంగా ఎన్ కౌంటర్ చేశారని పేర్కొంటూ, సుప్రీంను ఆశ్రయించడం విస్మయాన్ని కలిగిస్తోంది.