దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ విషయంలో నేడు కీలక సంఘటనలు చోటు చేసుకోనున్నాయి. దిశ నిందితులది నిజమైన ఎన్కౌంటర్ కాదని, ప్రజల భావోద్వేగాలకు తలొగ్గిన పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపేశారంటూ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో అప్పటికే హైకోర్టు మృతదేహాల్ని భద్రం చేయాలన్న ఆదేశాలు ఈ నెల 6 నుంచి అమల్లోనే ఉన్నాయి. పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళితే, మృతదేహాల విషయంపై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, నేడు విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది.
దిశ కేసులో నిందితులు మహమ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవుల మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం చేశాకే కుటుంబసభ్యులకు అప్పగించాలని, బూటక ఎన్కౌంటర్పై న్యాయ విచారణకు ఆదేశించాలని వారి తరపున కోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది.అయితే, శుక్రవారం విచారణ చేస్తామని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ వెల్లడించింది.
ఇదిలాఉండగా,నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా నిందితుల కుటుంబ సభ్యుల తరఫున వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వెటర్నరీ డాక్టర్ ‘దిశ’అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై నలుగురు సభ్యుల ఎన్హెచ్ఆర్సీ టీమ్ మూడో రోజు రెవెన్యూ, పోలీసు అధికారులను విచారించింది.ఎన్కౌంటర్లో గాయపడి హైటెక్ సిటీలోని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ను సుధీర్ఘంగా ప్రశ్నించింది. నిందితులు తుపాకులు లాక్కుంటే ఏం చేశారు? నలుగురిని 10 మంది అడ్డుకోలేక పోయారా? లారీ డ్రైవర్లకు వెపన్ షూటింగ్ తెలుసా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. వారి స్టేట్మెంట్ రికార్డు చేసుకుంది. సరిగ్గా ఈ వాదనల ఆధారంగానే ఎన్కౌంటర్కు గురైన వారి తరఫు న్యాయవాదులు తమ అభ్యంతరాలు వినిపించనున్నట్లు తెలుస్తోంది.