టీడీపీ అధినేత చంద్రబాబు కు, సుజనా చౌదరి కి ఉన్న బంధం గురించి తెలిసిందే.. కార్పొరేట్ కింగు అయిన సుజనా చౌదరి ని రాజకీయ నాయకుడిని చేసింది చంద్ర బాబే. వారి మధ్య బినామీ లావాదేవీలు కూడా ఉన్నాయని అంటారు. మరి అలాంటి సుజనా చౌదరి ఇటీవల బీజేపీ లో చేరారు. దీని వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు వైసీపీ మంత్రి కొడాలి నాని.
సుజనా చౌదరి మాటలకు బీజేపీలో విలువ లేదని, జైలుకు పోకుండా తప్పించుకోవడానికి సుజనా బీజేపీలో చేరారన్నారు కొడాలి నాని. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం ఉందని, అభివృద్ధి ఒకే చోట జరిగితే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మెజార్టీ ప్రజలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్నారని చెప్పారు.
కృష్ణా జిల్లా వాసిగా సీఎం వైయస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు కొడాలి నాని.. వైయస్ జగన్ అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని, ఏ ఒక్క ప్రాంతానికో, వర్గానికో కాదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటూ నిర్ణయాలు తీసుకుంటారన్నారు. కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటారన్నారు. చంద్రబాబు రైతులను ముంచేసి మళ్లీ రెచ్చగొడుతున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
కేఈ కృష్ణమూర్తి సీఎం వైయస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు ఏం మాట్లాడితే అదే చెప్తున్నాడన్నారు. రాజధాని రాష్ట్ర మధ్యలో ఉండాలంటే.. ఢిల్లీ తీసుకువచ్చి దేశం మధ్యలో పెట్టమంటారా..? అని ప్రశ్నించారు. అభివృద్ధి ఒకే చోట జరిగితే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉందని, ఈ విషయాన్ని సీఎం వైయస్ జగన్ అసెంబ్లీలో చెప్పారన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై కొంతకాలంగా డిమాండ్ ఉందని, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని, అందుకే సీఎం వైయస్ జగన్ మూడు ప్రాంతాల అభివృద్ధిపై మాట్లాడారని చెప్పారు. కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని, కొంపలు మునిగిపోయినట్లుగా చంద్రబాబు, పవన్ రాద్ధాంతం చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.