ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధాని రగడ భగ్గుమన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని అందుకే రాష్ట్రంలో మూడు రాజదానులు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది. అయితే తాజాగా రాజధాని అధ్యయన కమిటీ సీఎం జగన్ జగన్ కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో కమిటీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన 3 రాజధానిల ఏర్పాటు నిర్ణయాన్ని సమర్థించినట్లు సమాచారం. అయితే జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై రాజధాని రైతులు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 3 రాజధానిల ఏర్పాటయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించడంతో నిరవధిక సమ్మె చేపట్టారు అమరావతి రైతులు . ఇప్పుడు తాజాగా జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫారసులను తప్పుబడుతూ రాజధాని రైతులందరూ భగ్గుమన్నారు.జిఎన్ రావు ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా మందడం వై జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు అమరావతి రైతులు. వంగలపూడి లో ఉన్న సచివాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని అధ్యయన కమిటీ సభ్యులను అడ్డుకునేందుకు అమరావతి రైతులు ప్రయత్నించడంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో రైతులు రాజధాని అధ్యయన కమిటీ సభ్యులను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా పడుకోవటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పురుషులు నిరసనలో భాగంగా రోడ్డు పై పదుకోగా మహిళలు తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వానికి... రాజధాని అధ్యయన కమిటీకి శాపనార్థాలు పెట్టారు. అయితే ఈ ధర్నాలో పలువురు చిన్నారులు కూడా పాల్గొనడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జిఎన్ రావు కమిటీ ఎప్పుడు రైతుల అభిప్రాయాలను తెలుసుకుందని రైతులు కమిటీ సభ్యులను ప్రశ్నించారు. అసలు రాజధాని పై అధ్యయనం చేయడానికి జిఎన్ రావు కమిటీకి ఉన్న చట్టబద్ధత ఏంటి అంటూ వాళ్ళు నిలదీశారు. పోలీసులు ఆందోళనకారులను లోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .