జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిచ్చు రేగింది. ఇప్పటి వరకు అమరావతి రాజధానిగానే ప్రజలంతా భవిస్తూ వస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని రైతులు 33 వేల ఎకరాల భూమిని రాజధానికోసం ఇచ్చారు. అయితే, ఇప్పుడు అమరావతి రాజధాని కాదని, అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ తుళ్లూరులోనే ఉంటుందని, రాజ్ భవన్, మంత్రుల నివాసాలు అన్ని కూడా అమరావతిలోని ఉంటాయని అంటున్నారు.
గత ప్రభుత్వం చెప్పినట్టుగానే డెవలప్ చేసిన ఫ్లాట్ లను రైతులకు ఇస్తామని అంటున్నారు. అంతేకాదు, అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చి దిద్దుతామని చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఇక్కడే కొంత అయోమయం నెలకొన్నది. ఏ ప్రాంతం వ్యక్తులైనా కోరుకునేది అభివృద్ధి. ల్యాండ్ కు వ్యాల్యూ. ల్యాండ్ వ్యాల్యూ రావాలి అంటే అక్కడ ఎడ్యుకేషన్ సంస్థలు వచ్చినంత మాత్రానా అభివృద్ధి ఉంటుంది అనుకోవడం పొరపాటే. ఆ ప్రాంతంలో ఇండస్ట్రీలు ఏర్పాటు జరిగితేనే అభివృద్ధి చెందుతుంది.
అమరావతిలో నిజంగా కొన్ని ఇండస్ట్రీలు వస్తే .. రాజధాని అక్కడి నుంచి తరలి వెళ్లినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇండస్ట్రీలు లేకుండా భూమి వ్యాల్యూ లేకుండా చేస్తే మాత్రం రైతులు ఆందోళన చేయడం జరుగుతుంది. అదే విధంగా కర్నూలులో హైకోర్టు పెట్టాలని కమిటీ సూచించింది. కర్నూలులో హైకోర్టు పెట్టిన వెంటనే రాయలసీమ రీజియన్ అభివృద్ధి చెందుతుందా... హైకోర్టు పెట్టినంత మాత్రానా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే హైదరాబాద్ లో హైకోర్టు ఉన్న పాతబస్తీ ఏరియా ఎలా ఉన్నదో అందరికి తెలిసిందే.
కేవలం కోర్టు పెట్టినంత మాత్రానా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే పొరపాటే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైకోర్టు పెట్టి వదిలేస్తే ఇప్పడు కాకపోయినా కొన్నాళ్ల తరువాతైనా మరలా రాయలసీమ లో మళ్ళీ ఆందోళనలు జరుగుతాయి. కమిటీలో పేర్కొన్నట్టుగా నాలుగు రీజియన్స్ లో అభివృద్ధి కనిపించాలి అంటే తప్పనిసరిగా ఆయా ప్రాంతాల్లో ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలి. ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి కనిపిస్తుంది. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి అన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తుందా ప్రభుత్వం చూడాలి.