ఇటీవల నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ నూటికి నూరు శాతం లౌకిక రాష్ట్రమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇస్లామిక్ దేశంలో ఒకటి, రెండు పండుగలు మాత్రమే ఉంటాయని.. భారతదేశంలో ఎన్నో పండుగలు జరుపుకొంటున్నామని తెలిపారు. తెలంగాణలో అన్ని మతాలకు సమాన ఆదరణ లభిస్తోందన్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్ 20) రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.క్రిస్మస్ కేక్ను కట్ చేసి, క్రిస్టియన్లకు క్రిస్మస్ మరియు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు మహమూద్ అలీ,ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ ట్రీ ని వెలిగించి ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్ సమస్య లేని రాష్ట్రంగా తెలంగాణను తయారు చేశామని తెలిపారు. 23, 24 ఏళ్లలో నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం నాలుగేళ్లలో పూర్తి చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ద్వారా 70, 80 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు.
అంతకుముందు ఎన్టీఆర్ స్టేడియంలో చాగంటి కోటేశ్వర రావు ‘భాగవత సప్తాహం’ ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వర రావు మానవ జాతికి దొరికిన మణిపూస అని కొనియాడారు. ఆయణ్ని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక దైవచింతనపై ప్రసంగించారు. ఎక్కడికి వెళ్లినా రాని క్రమశిక్షణ గుడికి వెళ్తే వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. భగవంతుడి గురించి చదివినా, విన్నా గొప్ప పుణ్యం దక్కుతుందన్నారు.