రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని నగరాలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు వేదికయ్యాయి. ఏపీ రాజధాని అమరావతిలో, రాజధానిని అమరావతిని తరలించవద్దంతూ ఆ ప్రాంత రైతులు ఆందోళనలకు దిగితే, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలువురు రోడ్ల మీదకు వచ్చి నిరసనను వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రార్థనల అనంతరం యువకులు రోడ్లపైకి వచ్చి, చట్ట సవరణకు వ్యతిరేకంగా ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళనకారులను శాంతియుతంగా ర్యాలీలి చేపట్టడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇక పౌరసత్వ సవరణ చట్టంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు.
దేశ వ్యాప్తంగా చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతోన్న బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలుపాలని కోరారు. ఈ చట్టం కేవలం ముస్లింలను మాత్రమే కాదని, సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేస్తోందని అన్నారు. ఇక మరొకవైపు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి , రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నియమించిన నిపుణుల కమిటీ నివేదిక అందజేసిన అనంతరం వివరాలు బయటకు రాగానే, అమరావతి ప్రాంత రైతులు ఆందోళనను ఉధృతం చేశారు.
అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే ప్రకటించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఇక రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధాని నగరాలను ఏర్పాటు చేయనున్నట్లు శీతకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించిని విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగానే నిపుణుల కమిటీ నివేదికలో, మూడు రాజధాని నగరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. రాజధానిగా పేర్కొన్న అమరావతిని కేవలం శాసన రాజధానినే పరిమితం చేస్తూ, పరిపాలన రాజధాని విశాఖను ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ చేసిన సూచన రాజధాని రైతుల్లో ఆందోళనకు కారణమైంది.