చంద్రబాబునాయుడు మానసిక స్ధితిపై వైసిపి నేతలు చేస్తున్న విమర్శలు నిజమేనా ? అనే అనుమానం పెరిగిపోతోంది. తానేం మాట్లాడుతున్నారో కూడా చంద్రబాబుకు అర్ధం అవుతున్నట్లు లేదు. ఏడు మాసాల క్రితం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలే ఆయన మానసిక పరిస్ధతికి అద్దం పడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మాట్లాడుతూ తన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరంటూ చేసిన ప్రకటనే ఆశ్చర్యంగా ఉంది.
ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పనిచేశారట. మంచిదే అంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా చంద్రబాబు తప్ప మరెవరూ పనిచేయలేదన్నది వాస్తవమే. కాబట్టి అది రికార్డుగానే భావించాలి తప్పులేదు. కానీ అదే సమయంలో ప్రతిపక్ష నేతగా 11 ఏళ్ళు పనిచేసిన నేత ఎవరూ లేరని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఎవరైనా ముఖ్యమంత్రి ఉండాలని వీలైతే ఎంత ఎక్కువ కాలం ఉండాలా అనే ఆలోచిస్తారు.
అలాంటిది ప్రతిపక్షంలో ఉండటాన్ని కూడా రికార్డుగానే చంద్రబాబు చెప్పుకుంటున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. సుదీర్ఘంగా ఒకేసారి చంద్రబాబు పదేళ్ళు ప్రతిపక్షానికే పరిమితమయ్యారంటేనే ఏ స్ధాయిలో ప్రజలు తిరస్కరించారో అర్ధమైపోతోంది. ప్రజల తిరస్కారాన్ని కూడా చంద్రబాబు రికార్డుగా చెప్పుకుంటున్నారంటేనే ఆయన మానసిక పరిస్ధితిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
పైగా వైసిపికి 151 సీట్లు వచ్చాయని గర్వం పెరిగిపోయిందని మండిపోయారు. గతంలో తమకు కూడా 200 కు పైగా సీట్లు వచ్చినా చాలా హుందాగా వ్యవహరించినట్లు చెప్పుకున్నారు. 1994లో తెలుగుదేశంపార్టీకి 227 సీట్లు వచ్చింది వాస్తవమే. కానీ అప్పట్లో ఎన్టీయార్ నాయకత్వంలోని టిడిపి సాధించిన ఘన విజయం అది. చంద్రబాబుకు ఏమాత్రం సంబంధం లేదు.
ఎన్టీయార్ వల్ల వచ్చిన ఆ విజయాన్ని అదేదో తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. అంటే తనకు సంబంధం లేని విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవటానికి చంద్రబాబు ఏమాత్రం మొహమాట పడటం లేదు. వైసిపికొచ్చిన 151 సీట్ల మెజారిటి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం వల్లే వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్ముకుని పార్టీ ఎన్నికల్లో పోటిచేస్తే వచ్చింది 23 సీట్లు.