రాజకీయాలంటే ఎత్తులు పై ఎత్తులు సహజంగానే ఉంటాయి. రాజకీయాల్లో తలపండిన సీనియర్లు ఎత్తులు పైఎత్తులు వేసి విజయం సాధిస్తే అందులో ఎలాంటి థ్రిల్ ఉండదు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని నేతలు తలలు పండిన రాజకీయ నేతలను... రాజకీయ మేధావులు ఓడిస్తే అందులో ఎక్కడా లేని మజా ఉంటుందన్నది వాస్తవం. అలాంటి నేతలకు ఉండే క్రేజే వేరు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సైతం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అలాంటి క్రేజ్ నెలకొంది. ఒకే ఒకసారి ఎంపీగా గెలిచిన వై ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేవలం ఏడాదిలోపు ప్రత్యక్ష రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
అప్పటివరకు తండ్రి చాటు బిడ్డగానే ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయ సాధన కోసం సోనియాగాంధీతో ఎప్పుడైతే విభేదించారో... అప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాడు. రాజకీయంగా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు... అన్నిటికీ మించి ఓవైపు సోనియాగాంధీ, మరోవైపు నాడు సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయంగా శత్రువులుగా ఉన్న వాళ్లు సైతం... కేవలం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అణగ దొక్కాలన్న ఉద్దేశంతో తెర వెనక చేతులు కలిపారు.
ఇక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ప్పుడు టీఆర్ఎస్ వాళ్లు సైతం జగన్ను టార్గెట్ గా చేసుకుని ఎన్నో విమర్శలు చేశారు. నాడు బలమైన నేతగా ఉన్న సోనియా గాంధీతో పాటు ఎంతో మంది జగన్ను తీవ్రంగా విమర్శించిన వాళ్లే. అంతెందుకు ఇప్పుడు జగన్ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు సైతం జగన్ను విమర్శించారు. అయితే జగన్ ఎప్పుడైతే బలమైన నేత అని.. పట్టుదల మీద ఉంటాడని... మాట కోసం ప్రాణి ఇస్తాడని తెలిసిందో అప్పటి నుంచే అందరూ జగన్ వైపు వచ్చారు. చివరకు విజయం జగన్ సొంతం అయ్యింది.