రాజకీయ నాయకుల్లో అందరూ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోలేరు. రాజకీయాల్లో ఒక ధైర్యం, తెగువ ఉండాలి.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టాలి.. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఉండాలి. అలా ఉన్న నేతలు దూసుకు పోతూ ఉంటారు.. స్టేట్ వైడ్ పొలిటికల్ హీరోలు అవుతూ ఉంటారు. అలాంటి నేతల్లో కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే... ప్రస్తుత ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. కొడాలి నాని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉన్న రాజకీయ నేతల్లో ఒకరు. మాస్లో ఆయనకు బలమైన అభిమానులు ఉన్నారు.
గుడివాడలో నాని పార్టీలతో సంబంధం లేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాని... వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మరో రెండు సార్లు గెలిచారు. పార్టీలతో సంబంధం లేకుండా తాను గెలిచిన పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గుడివాడ మాత్రం కొడాలి నాని గెలుస్తూ వస్తున్నారు. అలాంటి నేతకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. నాని తెలుగుదేశం పార్టీలో ఉన్న టైం లో తాను ఎంత కష్టపడుతున్నా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ గౌరవించలేదు.
దేవినేని ఉమాతో పాటు నాని కష్టపడినా.. కూడా చంద్రబాబు ఉమా మాటలే నమ్మేవారు. అంతే కాకుండా ఉమా మాటలు నమ్మి ఎన్టీఆర్కు దగ్గరగా ఉంటున్నాడన్న కారణంతో నాని ని బాగా పక్కన పెట్టారు. 2009 ఎన్నికల్లో ఉమా సైతం నానికి టిక్కెట్ రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో నాని ఎన్టీఆర్ సిఫార్సుతో మళ్లీ టిక్కెట్ సొంతం చేసుకుని గెలిచాడు. అయినా అవమానాలే ఎదురు కావడంతో జగన్ను నమ్మి ఆ పార్టీలోకి వెళ్లాడు. వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచిన నాని ఇప్పుడు మంత్రి అయ్యాడు.
నన్ను నమ్మినందుకు జగన్ అంటే ఎంతో ఇష్టం అనే నాని.. తనకు మంత్రి పదవి పెద్ద లెక్క కాదని.. జగన్ కోసం ఆ పదవిని అయినా త్యాగం చేస్తానని చెపుతూ ఉంటాడు. ఏదేమైనా రాజకీయంగా నానికి ఎంతో విలువ ఇచ్చిన జగన్ అంటే నానికి ఎంత వీరాభిమానమే చెప్పక్కర్లేదు.