తెలంగాణ ఆర్టీసీ డిపోలో బ్రీత్ ఎనలైజర్ డ్రైవర్లకు చుక్కలు చూపిస్తోంది. మద్యం తాగకున్నా రీడింగ్ చూపిస్తోంది. ఫూళ్లు గా తాగేసినట్లు భారీ రీడింగ్ ఇస్తోంది. నేను తాగలేదు మొర్రో అని డ్రైవర్లు ఎంత చెప్పిన అధికారులు నమ్మని పరిస్థితి నెలకొంది. రాజు అనే వ్యక్తి మంచిర్యాల డిపోకు చెందిన ఒక డ్రైవర్ తన విధులు నిర్వర్తించడానికి శుక్రవారం ఉదయం మంచిర్యాల డిపోకు చేరుకున్నాడు. రాజధాని బస్సుకు డ్రైవర్గా విధులు నిర్వహించడానికి రాజు వెళ్ళాడు.
నిబంధనల ప్రకారం.. డ్యూటీ ఎక్కేముందు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజింగ్ టెస్ట్ చేస్తారు. ఇదే క్రమంలో ఆర్టీసీ అధికారులు రాజుకు కూడా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా.. పరికరం 53 పాయింట్లు చూపెట్టింది. నిజానికి అతడికి మద్యం తాగే అలవాటే లేదట. దానితో ఆ మెషీన్ తీరుతో రాజు ఒక్కసారిగా షాక్ గురిఅయ్యేడు.తాను మద్యం తాగలేదని, తనకు ఆ అలవాటే లేదని ఆర్టీసీ అధికారులకు వివరించే ప్రయత్నం చేసినా.. రాజుపై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో అతడు ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాడు. రెండు రోజుల కిందట మరో డ్రైవర్కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆర్టీసీ బ్రీత్ ఎనలైజర్తో టెస్ట్ నిర్వహించగా ఏకంగా 274 పాయింట్లు చూపించింది. చేసేదేం లేక కొంత మంది డ్రైవర్లు.. ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. వారి దగ్గర ఉన్న బ్రీత్ ఎనలైజర్తో పరిశీలించగా.. రీడింగ్ ‘జీరో’ అని సూచించింది.
దీంతో పనిచేయని బ్రీత్ పరికరాలతో ఆర్టీసీ అధికారులు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని డ్రైవర్లు ఆందోళనకు దిగారు. శుక్రవారం (డిసెంబర్ 20) ఉదయం మంచిర్యాల డిపో వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.దీంతో ఆగ్రహానికి లోనైన డ్రైవర్లు.. డిపో ఎదుట ఆందోళనకు దిగారు.తమను వేధింపులకు గురి చేయొద్దని, పనిచేయని ఆర్టీసీ బ్రీత్ ఎనలైజర్ను తొలగించాలని ఆర్టీసీ అధికారులను డ్రైవర్లు కోరారు.
తమ పనులను తాము సక్రమంగా చేసుకునేలా చూడాలని కోరారు. పనిచేయని పరికరాలతో తమ ఉద్యోగాలు ఊడే పరిస్థితి నెలకొందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ జీవితాలు నాశనం చేయొద్దని వాపోయారు .