పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రా జకీయమే ఊపిరిగా మసులుతున్న నాయకుడు. ప్రజలకు అత్యంత చేరువైన నాయకుడిగా కూడా గుర్తింపు సాధించారు. ప్రజలకు ఏం చేయాలో.. వారు ఏం కోరుకుంటున్నారో.. ఎక్కడ ఎలాంటి వ్యూహం వేస్తే.. సక్సెస్ అవుతామో.. తెలిసిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇదే ఆయనను నాలుగు దశాబ్దాలుగా విజయవంతమైన నాయకుడిగా నిలబెట్టింది. ఏపీ రాజకీయాల్లో ఐకాన్ నేతలుగా మనం చెప్పుకొనే చంద్ర బాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల సమకాలికుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పెద్దిరెడ్డి.. కాంగ్రెస్తో తన ప్రస్థానం ప్రారంభించారు.
తర్వాత చిత్తూరు జిల్లా పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో తన సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వర్గంతో రాజకీయంగా విభేదించారు. అదేసమయంలో వైఎస్కు చేరువ య్యారు. ఈ పరిణామాలతో వైఎస్కు, పెద్దిరెడ్డి కి మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. వైఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దిరెడ్డికి అటవీ శాఖ మంత్రిగా ప్రమొషన్ ఇచ్చారు. ఇక, వైఎస్ మరణం తర్వాత వైఎస్ ఫ్యామిలీతోనూ పెద్దిరెడ్డి తన రాజకీయ రిలేషన్ను కొనసాగించారు. జగన్కు చేరువయ్యారు. కాంగ్రెస్కు రిజైన్ చేసి జగన్ పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
దీంతో చిత్తూరు రాజకీయాలను జగన్ పెద్దిరెడ్డికే అప్పగించారు. చిత్తూరులో పెద్దిరెడ్డి చెప్పిందే వేదంగా జగన్ నడుచుకున్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో చిత్తూరులో ఒక్క స్థానం(చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం) మినహా అన్నిచోట్లా వైసీపీ జయకేతనం ఎగురవేయడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయనకు మళ్లీ కేబినెట్లో చోటు కల్పించి తన మనసులో ఉన్న పెద్దిరెడ్డిస్థానాన్ని నిరూపించుకున్నారు. అంతేకాదు, 2014, 2019 ఎన్నికల్లో పెద్ది రెడ్డి ఏకైక కుమారుడు మిథున్రెడ్డికి రాజంపేట ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడమే కాకుండా పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా కూడా ప్రమోషన్ ఇచ్చారు. ఇలా తనను నమ్మిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ప్రాధాన్యం ఇచ్చిన జగన్కు ఈ కుటుంబం హ్యాట్సాప్ చెబుతోంది.