వైఎస్ జగన్ 2011 లో కొత్తగా పార్టీ పెట్టిన సమయంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తే పార్టీ మనుగడ సాగించడం అటుంచితే జగన్ నాయకుడిగా ఎదగడం ఇబ్బంది అవుతుందని అన్నారు. ఆ తరువాత జగన్ ను లక్షకోట్ల అవినీతి కేసులో అప్పటి సిబిఐ అరెస్ట్ చేసింది. 16 నెలలపాటు జగన్ జైలులో ఉన్నారు. ఆయన్ను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఈ కేసులో ఇరికించినట్టు ఆరోపించారు. 16 నెలల తరువాత తిరిగి జగన్ విడుదలయ్యి బయటకు వచ్చిన తరువాత పార్టీపై పూర్తిగా దృష్టి పెట్టారు.
అప్పటి నుంచి మెల్లిగా ఎదగడం మొదలుపట్టారు. అయితే, జగన్ తెలంగాణలో కంటే ఆంధ్రాప్రాంతంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలోనే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలుగా విభజన జరిగింది. 2014 లో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల నుంచి వైకాపా పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో వైకాపా 65 స్థానాలకు పైగా గెలుచుకొని ప్రతిపక్షంలో నిలిచింది. తెలంగాణాలో కొన్ని స్థానాలు గెలుచుకున్నా ఆ తరువాత ఆ నాయకులు వైకాపా నుంచి తెరాస లో జాయిన్ అయ్యారు.
అయితే, 2014 నుంచి 2019 మధ్యలో వైకాపా అధినేత జగన్ ప్రజల మధ్యనే ఎక్కువగా ఉండటం మొదలుపెట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే జగన్ కు ప్లస్ అయ్యింది. జగన్ ను విజయం దిశగా నడిపించింది. జగన్ ఎదుగుదలకు పాదయాత్ర ఎంతగా సహాయం చేసిందో చెప్పక్కర్లేదు. 2016 నుంచి ఎన్నికలు జరిగే వరకు జగన్ ఎక్కువగా ప్రజల మధ్యనే ఉన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను విన్నారు. తెలుసుకున్నారు. ఇది జగన్ కు ఎంతగానో ఉపయోగపడింది.
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించడానికి పాదయాత్ర ఒక కారణం అయ్యింది. వైఎస్సాఆర్ రాజకీయాల్లో ఉండి 30 ఏళ్లలో సంపాదించిన పేరును జగన్ ఆరు నెలల కాలంలో సంపాదించారు. వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా... తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. ఈజీగానే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. వైఎస్సార్ ను మించేలా ఎదిగాడు.