ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ తీరుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతుంటే...జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం వైఎస్ జగన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్ని రోజులుగా జనసేనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ తన వ్యవహార శైలి మార్చుకోవాలన్నారు. ఇంగ్లీష్ భాష అమలుపై జగన్ నిర్ణయానికి మద్దతు తెలిపారు. గతంలో కూడా జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి చర్చల్లో నిలిచారు. తాజాగా సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాపాక వరప్రాసాద్ మరోసారి జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం మోరీ గ్రామంలో చేేనేత వేడుకల్లో పాల్గొన్న రాపాక జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీతో కలిసి ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం చేశారు. దీంతో జనసేన ఎమ్మెల్యే వైఖరి చర్చనీయాంశంగా మారింది.
గతంలో కూడా సీఎం జగన్మోహన్రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రకటించినందుకు సీఎం జగన్ను అభినందిస్తూ ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ర్యాలీ చేసి సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. ఆటోడ్రైవర్లతో కలిసి సభలో పాల్గొని.. అనంతరం జగన్ ఫోటోకు అప్పట్లో పాలాభిషేకం చేశారు. మళ్లీ తాజాగా, చేనేత మిత్ర సందర్భంగా మళ్లీ అదే పని చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ కొత్త పథకం సందర్భంగా పాలాభిషేకం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేసే జనసేన పార్టీ అధ్యక్షుడు ముందుగా తమ ఎమ్మెల్యే తీరును గమనించాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. జగన్ పథకాలు జనసేన ఎమ్మెల్యేకు అర్థమయ్యాయి కానీ...పవన్కు అర్థం కాలేదు అని అనుకోవాలా లేదంటే...పవన్ ఉద్దేశపూర్వక విమర్శలను ఆ పార్టీ ఎమ్మెల్యే లైట్ తీసుకుంటున్నారని అనుకోవాలా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.