మహిళల పై రోజు రోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి కానీ ఎక్కడా తగ్గడం లేదు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, ఎన్నిచర్యలు తీసుకున్నప్పటికీ ఆకతాయిల ఆగడాలకు మాత్రం ఎక్కడా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రభుత్వ ఆశయాలను నీరుగార్చే విధంగా కొందరు అధికారులు వ్యవహరించడం పై ప్రజలలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళ స్నానం చేస్తుండగా ఓ యువకుడు తన సెల్ఫోన్ వీడియోతో చిత్రాకరించాడు. వివరాల్లోకి వెళితే...
గోకవరం మండలంలో ఈ నెల 20వ తారీఖున ఈ ఘటన చోటుచేసుకుంది. గోకవరం గ్రామానికి చెందిన యువతి స్నానం చేస్తుండగా అదే మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దిండి రామ్కుమార్ (రాము) సెల్ఫోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించాడు. యువతి గమనించి కేకలు వేసుకొంటూ బయటకు వచ్చి రామును పట్టుకోబోగా తప్పించుకొని పారిపోయాడు. అయితే వీడియో తీసిన సెల్ మాత్రం ఆ యువతికి చిక్కింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో రాము పై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీసుస్టేషన్కు వెళ్లారు. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా... పోలీసులు ఫిర్యాదును స్వీకరించకుండా మూడు, నాలుగు గంటలపాటు వారిని స్టేషన్ వద్దే కూర్చోబెట్టారు. పైగా రాము కనబడితే ఫోన్ చేయండంటూ ఓ చీటీ పై రెండు ఫోన్ నెంబర్లు రాసి బాధితురాలికి ఇచ్చి ఇంటికి పంపించారు.
ఆ సమయంలో రాము సెల్ఫోన్ను బాధితురాలు ఎస్ఐ చెన్నారావుకు అందజేసింది. అయితే ఎస్ఐ వ్యవహరశైలి అనుమానాస్పదంగా ఉండడంతో బాధిత కుటుంబం విషయాన్ని మాజీ ఎంపీపీ జనపరెడ్డి సుబ్బారావుకు చెప్పారు. దీంతో ఆయన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సహకారంతో ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాత్రి 11గంటలకు పోలీసులు రాముపై కేసు నమోదు చేశారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు మీనమేషాలు లెక్కపెట్టకుండా వెంటనే ఫిర్యాదు తీసుకుని తగిన చర్యలు తీసుకోకుండా ఉంటే. ఇక ఆకతాయిల ఆగడాలకు కొదవేముంటది. దీంతో పోలీసుల నిర్లక్ష్య వ్యవహార శైలి చూసి ఎస్ ఐ పైన కూడా కేసు నమోదు చేశారు బాధితులు. రాముపై ఫిర్యాదు తీసుకునే విషయం లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, బాధితురాలు ఇచ్చిన ఆధారాలను(సెల్ఫోన్లోని వీడియో) ఎస్ఐ చెన్నారావు మాయం చేశారని ఆరోపిస్తూ శనివారం స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ముందు మాజీ ఎంపీపీ సుబ్బారావు ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు ఆందోళనకు చేపట్టారు. స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.
ఇక ఈ విషయం నార్త్జోన్ డీఎస్పీ పి.సత్యనారాయణరావు, కోరుకొండ సీఐ పవన్కుమార్రెడ్డి దృష్టికెళ్లడంతో వారు గోకవరం పోలీస్స్టేషన్కు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. నిందితుడి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు, ఎస్ఐ పై చేస్తున్న ఆరోపణలపై విచారణ జరుపుతామని హమీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. ఇక మరి రక్షణ కల్పించే రక్షకభటులే ఇలా నిర్లక్ష్యంగా ఉంటే సామాన్య ప్రజలు న్యాయం కోసం ఎవరి దగ్గరకెళతారు. ఇటీవలె జరిగిన దిశ ఘటనలో కూడా పోలీసులు ఇలానే ప్రవర్తించారు. దిశ చెల్లి, తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఆమె ఎవరితోనో వెళ్ళిపోయిందని వాళ్ళకు సంబంధం లేదని అన్నారు. ఒక్కరిసారి ఆ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులను ఊహించుకుంటే ఎదుటి వారి బాధ అర్ధమవుతుందని పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు.