ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని  రాజధాని అంశం వివాదాస్పదం కావడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆయన చేసిన నిర్వాకంతోనే ప్రస్తుతం పరిస్థితుల్లో రాజధాని ప్రాంత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబేనని స్పష్టం చేశారు.రెండు, మూడు వేల ఎకరాల్లో రాజధాని కట్టుకుని ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదని అభిప్రాయపడ్డారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసి రాజధానిని అభివృద్ధి చేయాలనుకోవడం సబబు కాదన్నారు. గాడిద పని గాడిద చేయాలని, అలా చేయనందుకే చంద్రబాబు బొక్క బోర్లా పడ్డారన్నారు. చంద్రబాబుకు అసలు తలకాయ ఉందా  అని నిలదీశారు.

కుక్కపని కుక్క చేయాలంటూ తీవ్ర స్థాయిలో  ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఇటీవల బాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ కార్యకర్తలు, ఓ వర్గం రైతులు.. నిరసన తెలియజేస్తూ మరో వర్గం రైతులు పోటీపడ్డాయని చెప్పారు  చంద్రబాబు కాన్వాయ్ వెంకటాయపాలెం దగ్గరకు చేరుకోగానే.. ఓ వర్గం రైతులు రెచ్చిపోయారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు, కర్రలు విసిరారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.. ప్లకార్డులు ప్రదర్శించారన్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే.. నాయకులు ప్రాంతాల వారీగా చీలిపోయారని విమర్శించారు.  జగన్ మూడు రాజధానులు ఉండొచ్చని ప్రకటన చేయగానే.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయకత్వంపై కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు సమీకరించాల్సిన అవసరం ఏముందని నారాయణ సూటిగా ప్రశ్నించారు.

సీపీఐ 95వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  పార్టీ నేత జంగాల అజయ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం ఒకేచోట ఉండాలని ఈ సందర్బంగా నారాయణ స్పష్టం చేశారు. అసెంబ్లీ, సచివాలయం ఉన్న రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మత ప్రాతిపదికన దేశాన్ని చీలుస్తారా అని మండిపడ్డారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన దేశాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటోందని  ఆరోపించారు. 
    

మరింత సమాచారం తెలుసుకోండి: