జగన్ ఏపీ సీఎం గా ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నారు. ఆయన పాలనపై చాలా వరకూ పాజిటివ్ స్పందన కనిపిస్తుంది. ఇక వైసీపీ నేతలైతే జగన్ పాలన అద్భుతం అంటున్నారు. అంతేకాదు.. మరో 30 యేళ్లు జగనే ఏపీ కి సీఎం అంటున్నారు.
చట్టాలను అమలు చేయడంలో సీఎం వైయస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. వైయస్ జగన్ ఈ రాష్ట్రానికి మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రి ఉండాలన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో ఏ పార్టీ నాయకుడు చేయని పాదయాత్ర వైయస్ జగన్ చేశారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం ఉద్దేశమని చెప్పారు.
ఇక జగన్ జన్మదిన వేడుకలు ఊరూరా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లాలో 47 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. జిల్లా ప్రధాన కేంద్రాలతో పాటు పలు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్జగన్ జన్మదినం సందర్భంగా రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కో-ఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, జక్కంపూడి విజయలక్ష్మి , బొమ్మన రాజ్కుమార్ , ఆకుల వీర్రాజు, గణేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో వాడవాడలా సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపేట, జొన్నాడలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అనంతరం రక్తదాన శిబిరాలను ప్రారంభించారు.