దేశంలో పౌరసత్వంకు సంబంధించి నిరసనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్, తృణమూల్, లెఫ్ట్, మజ్లీస్ పార్టీలు పౌరసత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్నాయి. దేశంలోని ప్రజలు ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే.. మరికొందరు బిల్లుకు సపోర్ట్ చేస్తూ రోడ్డుపైకి వస్తున్నారు. పోటాపోటీ నినాదాలతో దేశం హోరెత్తిపోతున్నది. దీంతో ప్రభుత్వానికి దీనిని ఎలా కట్టడి చేయాలో అర్ధం కావడం లేదు.
బిల్లులో ఎలాంటి వివాదం లేకున్నా కావాలని వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్రం అంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని అనుకున్న బిల్లును అప్పట్లో ఆ పార్టీకి ఎలా తీసుకురావాలో అర్ధంగాక పక్కన పెట్టింది. అదే బిల్లును ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చింది. కాంగ్రెస్ తీసుకురాలేకపోవడంతో, దానిని బీజేపీ ప్రభుత్వం తీసుకురావడమే వివాదానికి దారితీసిందా అంటే కొంతమంది అవుననే అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు అప్పట్లో ఇందిరాగాంధీ తేవాలని అనుకుంది. ఆర్టికల్ 370 రద్దు చేయాలని ఆ తరువాత ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు కూడా అనుకున్నారు. అవి సాధ్యం కాకపోవడంతో పక్కన పెట్టారు.
దానిని సమర్ధవంతంగా బీజేపీ తీసుకొచ్చింది. 134 ఏళ్ల రామ మందిర్ వివాదానికి చెక్ పెట్టింది. ఇప్పుడు పౌరసత్వం బిల్లును తీసుకొచ్చింది. పౌరసత్వం బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తడంతో దీనిపై ఓ జాతీయ మీడియా సంస్థ పబ్లిక్ పోల్ ను నిర్వహించింది. ఈ పోల్ లో అనేక ఆసక్తికరమైన రిజల్ట్ వచ్చాయి. ఈ బిల్లుకు అనుకూలంగా 62శాతం మంది ఓటు వేశారు. వ్యతిరేకంగా కేవలం 37శాతం మంది మాత్రమే ఓటు వేసినట్టుగా తెలుస్తోంది.
నిరసనలు ఎక్కువగా జరుగుతున్న నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా బిల్లుకు అనుకూలంగానే ఓటు వేశారు. అస్సాం, యూపీలో కూడా అనుకూలంగా ఓటింగ్ జరిగింది. సౌత్ లో కూడా బిల్లుకు అనుకూలంగానే ఎక్కువమంది ఓటు వేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి దేశం మొత్తం మీద ఈ బిల్లుకు అనుకూలంగా 62% మంది ఓటు వేయడంతో మెజారిటీ ప్రజలు బిల్లును స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ప్రతిపక్షాలు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియడం లేదు.