ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ నరేంద్ర మోదీ నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను రెప రెపలాడించాలని  పిలుపునిచ్చారు.  శనివారం రాత్రి హైదరాబాద్‌ దారుస్సలాం మైదానంలో యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన భారీ బహిరంగ సభలో  ఈ  విధంగా పేర్కొన్నారు . ‘మహత్మాగాంధీ, అంబేద్కర్, మౌలానా అజాద్, నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌లు జీవించి లేనప్పటికీ వారి ఆశయాలు మాత్రం ఇంకా సజీవంగా ఉన్నాయి. వాటిని  మనం తప్పనిసరి పాటించాలి అని ఆయన తెలియజేశారు. 

 

 బీజేపీ, సంఘ్‌పరివార్‌లకు మనమంతా భారతీయులమని ఘాటైన సమాధానం చెప్పేందుకు ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలి. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ ఉపసంహరించే వరకు ప్రతి ఇంటిపై  జెండాలు అలాగే ఉంచాలి’ అని పిలుపునిచ్చారు. కనీసం ఆరుమాసాలైనా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజా స్వామ్యయుతంగా, హింసకు తావివ్వకుండా, శాంతియుతంగా  ఆందోళన కొనసాగించాలన్నారు.  నిజానికి ఈ పోరాటం భారతీయులందరిని రక్షించేందుకే అని చెప్పారు .అలాగే సీఎం కేసీఆర్‌కు  కేరళలో మాదిరిగా తెలంగాణలో కూడా జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ) అమలు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య  మాట్లాడుతూ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

 

ఇక దీనిపై జమాత్‌–ఇ–ఇస్లామి హింద్‌ రాష్ట్ర అధ్యక్షుడు హమీద్‌ మహ్మద్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో  కేంద్ర పాలకుల మెడలు వంచినట్లు.. అమిత్‌షా మెడలు వంచి చట్టం ఉపసంహరించేలా ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. అస్సాంకు చెందిన సామాజిక కార్యకర్త అబ్ధుల్‌ వదూర్‌ అమాన్‌ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు.

 

బీజేపీయేతర పాలిత రాష్ట్రాలోని సీఎంలు వీటి అమలును నిలిపివేయాలని పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో ఢిల్లీకి చెందిన జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ  విద్యార్దులు కూడా పాల్గొన్నారు. కాగా, జాతీయ జెండాలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో  రెపరెపలాడాయి.  జాతీయ గీతంతో ఈ సభను  ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: