కొంత మంది మ‌నుషులు వాళ్ల‌కి ఏవో కొన్ని మంత్రాలు, మాయ‌లు తెలుసు అన్న‌మాయ‌లో ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు. అయితే ఇటీవ‌లె ఛ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలో ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే...

 

 ఓ వ్యక్తి తనకు మానవాతీత శక్తులు ఉన్నాయని నమ్మించేందుకు చేసిన ప్రయోగం విషాదాంతమైంది. మహాసముంద్‌ జిల్లా పచరీ గ్రామంలో సమాధిలో సాధన చేస్తానంటూ రంగంలోకి దిగిన ఓ యువకుడు చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గత ఐదేళ్లుగా ఆ యువకుడు ఇలాంటి ప్రమాదకర సజీవ సమాధి సాధన ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతీసారి మరణపు అంచుల వ‌ర‌కు వెళ్లి వచ్చేవాడు కాని అత‌ను త‌న ప్ర‌య‌త్నాన్ని మాత్రం మానుకోలేదు.  చివ‌ర‌కు మృత్యువాత‌ప‌డ్డాడు. 

 


చమన్‌దాస్ జోషి ముప్పై ఏళ్ళ యువకుడు మొదటి ఏడాది 24 గంటలు, రెండో ఏడాది 48 గంటలు, మూడో ఏడాది 72 గంటలు, నాలుగో ఏడాది 96 గంటల పాటు సజీవ సమాధి సాధన చేస్తూ వచ్చాడు. గత నాలుగు దఫాల్లో సమాధిలో నుంచి స్పృహ లేని స్థితిలో అతనిని బయటకు తీసుకు వచ్చారు. ఐదోసారి 108 గంటల పాటు సమాధిలో ఉంటానంటూ ప్రతినబూనాడు . ఇందుకోసం డిసెంబర్ 16న నాలుగు అడుగుల లోతైన గొయ్యి తవ్వాడు. తెల్లని వస్త్రం ధరించి, పూజలు చేసిన అనంతరం సమాధిలో కూర్చున్నాడు. తర్వాత తన అనుచరునితో ఆ గొయ్యిని కర్రలతో మూసివేసి, దానిపై బురదపూశారు.

 


తిరిగి జోషి చెప్పిన సమయానికి అంటే డిసెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటల సమయానికి స్థానికులు సమాధిని తెరిచారు. అయితే లోపల జోషి ఎప్పటి మాదిరిగానే అచేతన స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతనిని అక్క‌డ ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ జిల్లా ఆసుపత్రికి తరలించ‌గా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైధ్యులు నిర్ధారించారు. ఇలాంటి ప‌నులు చేయ‌డం వ‌ల్ల ఎవ్వ‌రికీ ఉప‌యోగం లేక‌పోవ‌డంతో త‌న ప్రాణాన్ని కోల్పోవ‌డ‌మే కాక కుటుంబ స‌భ్యుల‌కు తీర‌ని బాధ‌ను మిగిల్చివెళ‌తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: