దిశ నిందితుల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో రీపోస్ట్ మార్టం జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రేపు సాయంత్రం ఐదు గంటల లోపు పోస్ట్ మార్టం చేయనున్నారు. అయితే ఈ సారి తెలంగాణ ఫోరెన్సిక్ టీం కాకుండా, ఎయిమ్స్ టీం దిశ నిందితుల మృత దేహాలకు పోస్ట్ మార్టం చేయనుంది. 

 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత నిందితుల బాడీలను కోర్టు ఆదేశాల మేరకు భద్రపరచాల్సి వచ్చింది. ఎన్ కౌంటర్ డిసెంబర్ 6 న తెల్లవారుజామున జరిగింది. స్పాట్ లోనే గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ టీం పోస్ట్ మార్టం నిర్వహించింది. అయితే ఎన్ కౌంటర్ పై పౌరహక్కుల సంఘాల అనుమానాలతో మృత దేహాలకు అంత్యక్రియలు నిర్విహించకుండా .. ముందుగా మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో మూడు రోజుల పాటు ఉంచారు. అయితే అక్కడ మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ సౌకర్యం లేదని.. కోర్టు అనుమతితో డిసెంబర్ 9 వ తేదీన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

 

గాంధీ మార్చూరీలో ఉన్న దిశ నిందితులు  మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు.. జొల్లు శివ, నవీన్ ల మృతదేహాలను 7,8,10,11 ఫ్రీజర్ బాక్సులలో భద్రపరిచారు. వాస్తవానికి మృతి చెందగానే శరీరాన్ని ఫ్రీజర్ లో పెట్టాలి. కానీ పోస్ట్ మార్టం .. ఆ తర్వాత మహబూబ్ నగర్లో మూడు రోజుల పాటూ ఉంచటంతో అప్పటికే దిశ నిందితుల మృత దేహాల్లో డీ కంపోజ్ మొదలైంది. అప్పటికే డీ కంపోజ్ మొదలైన మృతదేహాలను గాంధీ మార్చూరీలోని ఫ్రీజర్లలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే మృతదేహాలు యాభై శాతం పాడయ్యాయి. ఇదే విషయాన్ని శనివారం హైకోర్టు దర్మాసనానికి గాంధీ సూపరిండెంట్ వివరించారు.  దాంతో సోమవారం సాయంత్రం 5 గంటల లోపు మరోసారి పోస్ట్ మార్టం చేసి.. దాన్ని మొత్తం వీడియో రికార్డింగ్ చేసి.. మృతదేహాలను బంధువులకు అప్పగించాలని ఆదేశించింది కోర్టు. అంతేకాదు వీడియో రికార్డు మొత్తం కోర్టుకు సమర్పించాలని చెప్పింది.

 

కోర్టు ఆదేశాలతో ఈ రోజు ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్ల పర్యవేక్షణలో దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్ మార్టం జరగనుంది. పోస్ట్ మార్టం మొత్తాన్ని వీడియో రికార్డు చేయనున్నారు. ఇప్పటికే గాంధీ మార్చురీలో నాలుగు మృత దేహాలకు భద్రత కల్పించారు. మరోవైపు ఎన్ కౌంటర్ జరిగి ఇన్ని రోజులవుతున్నా.. తమ వాళ్ళ మృతదేహాలను అప్పగించక పోవటం పై సీరియస్ గా ఉన్నారు కుటుంబ సభ్యులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: