ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. చంద్రశేఖర్ రావు 14వ లోక్సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 15వ లోక్సభలో మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఆయన తన నాలుగున్నర సంవత్సరాల పాలన తరువాత సెప్టెంబర్ 2018లో తెలంగాణ శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మెగించింది.
తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు 2014 ఎన్నికల్లోనే కాక 2018 ఎన్నికల్లోనూ రెండుసార్లు విజయపతాకాన్ని ఎగురవేశారు. దీంతో ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. కేసీఆర్ ప్రారంభించిన చక్కటి పథకాలలో కంటి వెలుగు ఒకటి. కంటి వెలుగు తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.
అంతేకాక బాలింతలకు తెలంగాణా ప్రభుత్వం అందించిన కేసీఆర్ కిట్స్ కూడా మంచి సక్సెస్ను సాధించాయి. స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిక్రితం ప్రారంభమైన ‘కేసీఆర్ కిట్స్’ పథకం గురించి అనేక విషయాల్లో ఇది సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతోందని చెప్పాలి. ఒక రెండు అంశాల్లోనైతే ముఖ్యమంత్రిని మనసారా అభినందించడం కనీస ధర్మం అంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అన్ని విషయాల్లో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసే పథకాలు చేపట్టింది. అందులో కేసీఆర్ కిట్స్ ఒకటి. ఇది ఒక రకంగా ప్రభుత్వ బాధ్యతను పునరుద్ఘాటించే పథకం. దశాభ్దాల జీవన విధ్వంసం స్థానే నవ తెలంగాణలో సరికొత్త చరిత్రను తిరగ రాసే ప్రయత్నం. ఆ దిశగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు పునరంకితం అవడం విశేషం.
రైతులకు పెట్టుబడి సాయం కింద కొంత మొత్తాన్ని అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మొదట ఎకరానికి సంవత్సరానికి రూ. 8000 చొప్పున అందజేసింది. గత ఎన్నికల హామీల్లో భాగంగా ఆ మొత్తాన్ని రూ. 10 వేలకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. అయితే మొదట రైతుల నుంచి ప్రశంసలు అందుకున్న దీని ద్వారా వందల ఎకరాలు ఉన్న భూస్వాములే లాభపడుతున్నారంటూ చిన్నకారు రైతులు ఆరోపించారు.