ఆంధ్రప్రదేశ్ లో మద్యం విక్రయాలను తగ్గించేందుకు, ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా మద్యపానంపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం సిద్దమైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 వ తేదీ నుంచి ప్రభుత్వం మద్యం షాపులను తన ఆధీనంలోకి తీసుకుంది. 20శాతం మేర షాపులను తగ్గించింది. షాపులను తగ్గించడమే కాకుండా, షాపుల సమయాన్ని కూడా తగ్గించింది.
ఇక మందు రేట్లను భారీగా పెంచింది. ఇలా భారీగా రేట్లు పెంచడంతో మద్యం విక్రయాలు తగ్గిపోయాయి. పర్మిట్ రూములను కూడా ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. వైన్ షాపులను తగ్గించిన ప్రభుత్వం బార్ లపై దృష్టి పెట్టింది. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. బార్లను సగానికి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే లైసెన్స్ ఫీజ్ ను భారీగా పెంచింది. లైసెన్స్ ఫీజ్ రూ. 10 లక్షలుగా నిర్ణయం తీసుకుంది. ఇది నాన్ రిఫండబుల్. ఈ ఫీజు చెల్లించిన తరువాత బార్లకు సంబంధించి లాటరీ తీస్తారు. ఆ లాటరీలో వచ్చిన వాళ్లకు బార్ లను కేటాయిస్తారు. జనాభా ప్రాతిపదిక లైసెన్స్ ఫీజు నిర్ణయించింది.
50వేల జనాభా ఉండే పట్టణాల్లో బార్ కు రూ. 25 లక్షలు. 5 లక్షల జనాభా ఉండే పట్టణాల్లోని బార్లకు రూ. 50 లక్షలు, 5 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో బార్లకు రూ. 75 లక్షల చొప్పున రెండేళ్ల లైసెన్స్ ఫీజ్ కింద ఏర్పాటు చేసింది.
దీనిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని బార్ యాజమాన్య సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చింది. ప్రస్తుతం యధాతథ స్థితిని కొనసాగించాలని చెప్పింది. తదుపరి విచారణను ఆరువారాల పాటు వాయిదా వేసింది. దీంతో కేసును ఆరు వారల పాటు వాయిదా వేశారు. దీంతో జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అటు మందు బాబులకు మాత్రం ఇది మంచి కిక్కిచ్చే న్యూస్ అనే చెప్పాలి.