ఆంధ్రప్రదేశ్ లోని రైతుల కోసం జగన్ ప్రభుత్వం అనేక పధకాలు తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అందరికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జగన్ రైతులకోసం మూడు వరాలను తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కేంద్రం రైతుల వద్ద నుంచి కొన్ని పంటలను మాత్రమే కొనుగోలు చేస్తుంది. అది పండించిన పంటలో 25శాతం మేర కొనుగోలు చేస్తుంది. వరి, గోధుమ, అపరాలు, పత్తి వంటి వాటిని కేంద్రం కొనుగోలు చేస్తుంది.
25 శాతం పంటలను మాత్రమే కొనుగోలు చేస్తోంది. మిగిలిన పంటకు మద్దతు ధర లేక, అమ్మకాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను అధికమించేందుకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. కేంద్రం కొనుగోలు చేయగా మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది రైతులకు శుభవార్తే అని చెప్పాలి.
దీంతో పాటుగా రైతుల కోసం మరో నిర్ణయం కూడా తీసుకున్నది.
ఇప్పటి వరకు సీజన్ ను బట్టి తాత్కాలికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇలా శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేస్తే... రైతులు తమ పంటలను ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు.
మార్కెట్ సబ్ యార్డులలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. బహిరంగ మార్కెట్ లో ధరలు తగ్గినపుడు, గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు తమ పంటను డైరెక్ట్ గా మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చి అమ్ముకునే సౌకర్యం కల్పిస్తోంది ప్రభుత్వం. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో పౌరసరఫరాలశాఖ, మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్ నోడల్ ఏజెన్సీలుగా పంటలను కొనుగోలు చేయనున్నాయి. జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.