ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ బాలికల పై జరిగే అరాచకాలు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి పోలీసులు తగు చర్యలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని చోట్ల ఇందుకు భిన్నంగా కేసు దమోదు చేసుకునే విషయంలో కూడా పోలీసులు కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కొందరు బాధితులు వాపోవడం అనేది ఈ మధ్య కాలంలో తరుచూ జరుగుతూ వస్తుంది. వివరాల్లోకి వెళితే...
వారణాసికి చెందిన ఓ మైనర్ బాలికకు ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తామని ఆశపెట్టి అక్కడకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాలికను వ్యభిచార గృహంలో విక్రయించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులపై చర్యలు తీసుకోవట్లేదంటూ బాధిత మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి వారణాసి పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మరింత షాకింగ్గా ఉంది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరం పోలీసుల న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు ముగ్గురినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అత్యాచార బాధితురాలితో పాటు వారి తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. వారణాసికి చెందిన విశాల్ మౌర్యా, ఉత్కర్ష్ తివారి, జమీర్ ఆలంలు మైనర్ బాలికకు ఉద్యోగం పేరుతో మాయమాటలు చెప్పి ముంబై తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి వ్యభిచార గృహానికి విక్రయించారు. అయితే బాధిత బాలిక వ్యభిచార గృహం నుంచి ఎలాగోలా తప్పించుకొని అలహాబాద్కు రావడంతో అక్కడి రైల్వే పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
దీంతో నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు పెట్టకుండా నిర్లక్ష్యం చేయడంతో బాధితురాలు, బాలిక తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే బాధితురాలి వద్ద ఓ లేఖను పోలీసులు కనుగొన్నారు. అందులో తనపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేయడం లేదని, వారిపై నమోదు చేసిన వివిధ సెక్షన్లను సైతం తొలగించారని బాధితురాలు తన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసి ఉంది.