హైదరాబాద్‌ నగరంలో మరో అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ రేప్, మర్డర్ ఘటన ఇంకా మర్చిపోకముందే అదే న‌గ‌రంలో మ‌రో ఘ‌ట‌న జ‌రిగింది. మేడ్చల్‌ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో చ‌ద‌వుతున్న విద్యార్థినిపై కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రేప్ చేశాడు. ఈ ఘటనపై ఆ యువతి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. 

 


మేడ్చల్‌లోని మ‌ల్లారెడ్డి కాలేజీలో పేట్ బషీరాబాద్‌కు చెందిన ఓ యవతి (19) ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది. అయితే, కాలేజీలో ఆమె ప‌ట్ల దారుణం జ‌రిగింది.  కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ల్యాబ్‌కి పిలిచి తలుపులు వేసి బలవంతంగా అత్యాచారం చేశాడని పేట్ బషీరాబాద్ పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకుని ఆమెను వైద్య పరీక్షల కోసం పేట్ బషీరాబాద్ పోలీసుల ఆసుపత్రి తరలించారు. బాధిత విద్యార్థి వాంగ్మూలం స్వీక‌రించడంతో పాటుగా వైద్య‌ప‌రీక్ష‌ల రిపోర్టును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీసుల నిర్ణ‌యం తీసుకుంటార‌ని స‌మాచారం. 

 

కాగా, హైద‌రాబాద్ న‌గ‌రంలోన‌కని పేరెన్నిక‌గ‌న్న కాలేజీల్లో ఒక‌టైన  మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో విద్యార్థినిపై ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం క‌ల‌క‌లంగా మారింది. విద్యాబోధ‌న స‌హా వివిధ అంశాల్లో కాలేజీ ప‌ట్ల స‌ద‌భిప్రాయం ఉండ‌గా ఈ ఘ‌ట‌న మ‌చ్చ వంటిద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. కాగా, బాధిత విద్యార్థికి న్యాయం చేయాల‌ని, దుర్మార్గానికి ఒడిగ‌ట్టిన అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని విద్యార్థి సంఘాల నాయ‌కులు ఇప్ప‌టికే డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌కుండా విద్యార్థి ఫిర్యాదుపై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌తో విద్యార్థుల‌త త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: