పరిటాల ఫ్యామిలీ గురించి తెలియని వారుండరు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తమకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న వీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైసిపి చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఇదిలా ఉండగా మరో సారి జగన్ పరిటాల ఫ్యామిలీకి మరో షాక్ ఇచ్చారు. అదేమంటే...
అనంతపురం జిల్లా రామగిరి మండల పరిధిలో ఉన్న నసనకోట ముత్యాలమ్మ ఆలయం.. ఈ ఆలయ వార్షిక ఆదాయం కోట్లలోనే ఉంటుంది. 27 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయ పాలక బాధ్యతలు నాటి నుంచి నేటి వరకు పరిటాల కుటుంబ సభ్యుల చేతిలో ఉంటూ వచ్చాయి. మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండయ్య ఆలయ చైర్మన్గా, పరిటాల కుటుంబ సభ్యులతోపాటు, అనుచరులతో ఏర్పాటైన కమిటీ ఆలయ పాలక వ్యవహారాలను చూసుకుంటూ వస్తుంది. ఇదే కాకుండా ఈ ఆలయం చుట్టూరా పరిటాల కుటుంబానికి చెందిన భూములు కూడా ఉన్నాయి.
ఇంకా ఆలయానికి ఆదాయంగా కోట్లాది రూపాయలు వస్తుంటాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కానుకలుగా బంగారు, వెండిని సమర్పిస్తుంటారు. ఇలా భారీ మెత్తంలో నిధులు, కానుకలతోపాటు ఆలయ పరిధిలో పార్కింగ్ ఫీజు, కొబ్బరి కాయల అమ్మకం, మద్యం అమ్మకాలతో మరిన్ని నిధులు చేకూరుతుంటాయి. మరికొన్ని నిధులను విరాళాల రూపంలో ఆలయ కమిటీ సేకరిస్తుంది. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత 27 ఏళ్లుగా పరిటాల కుటుంబం చేతుల్లోనే ఈ ఆలయం ఉందని, భారీ మొత్తంలో సమకూరే నిధులను, వెండి, బంగారు కానుకలను వారు పక్కదారి పట్టిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఆఖరకు దేవాలయ పరిసర ప్రాంతాల్లోని షాపులకు ఎటువంటి వేలంపాట నిర్వహించకుండా వారి అనుచరులకే కట్టబెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు.
దీనికి స్పందించిన జగన్ సర్కార్ నసనకోట ముత్యాలమ్మ ఆలయాన్ని స్వాధీన పరుచుకోవాల్సిందిగా దేవాదాయశాఖకు ఆదేశాలు జారీ చేసి. ఆలయ ప్రయివేటు కమిటీని రద్దు చేసిన దేవాదాయశాఖ ఈవోను నియమించారు. ఈ క్రమంలో ప్రభుత్వ పరంగా పాలక కమిటీని అతి త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఆలయంలోని ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం, దాడులు జరగకుండా పర్యవేక్షించేందుకు పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.