సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో రాంపూర్ జిల్లా యంత్రాంగం కనీసం 28 మందికి నోటీసులు జారీ చేసింది. పోలీసు మోటారు సైకిళ్ళు,ప్రభుత్వ ఆస్తుల నష్టాలకు గాను వీరికి రాంపూర్ జిల్లా యంత్రాగం నోటీసులు జారీ చేసింది. ప్రదర్శనల సందర్భంగా హింసకు పాల్పడిన వారిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
పోలీసుల అణిచివేత మరియు 16 మంది మరణించిన ఈ నిరసనలో 14,86,500 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని రాంపూర్ జిల్లా యంత్రాంగం నోటీసులో పేర్కొంది. విధ్వంసానికి కారణమైన 28 మందిలో, ఎంబ్రాయిడరీ కార్మికుడు మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇప్పటికే అదుపులో ఉన్నారు. నోటీసులు అందిన వారందరికి ఒకేలాంటి నోటీసులు వచ్చాయి. నోటీసు ప్రకారం ఆస్తి నష్టం జరిగిన జాబితా లో 750,000 రూపాయల విలువైన భోట్ పోలీస్ స్టేషన్, 65,000 రూపాయల ఖరీదు చేసే సబ్ ఇన్స్పెక్టర్ యొక్క మోటార్ సైకిల్, 90,000 రూపాయల విలువైన సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ యొక్క మోటార్ సైకిల్, వైర్లెస్ సెట్, హూటర్ / లౌడ్ స్పీకర్, 10 పొలిసు లాఠీలు, మూడు హెల్మెట్లు,మూడు బాడీ ప్రొటెక్టర్లు వున్నాయి. ఇంత పెద్ద నష్టాన్ని తిరిగి పొందాలని ప్రభుత్వం ఎందుకు డిమాండ్ చేయకూడదనే దానిపై నోటీసు వివరణ కోరింది.
అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా నోటీసులు జారీ చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. స్థానిక పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా నోటీసులు జారీ చేశారు. పోలీసుల వద్ద వీడియో క్లిప్లు, మీడియా హౌస్లు మరియు స్థానిక నివాసితులు తీసిన ఛాయాచిత్రాలు ఉన్నాయి. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న సిసిటివిల ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు. దర్యాప్తులో పోలీసులు గుర్తించిన 28 మందికి మేము నోటీసులు జారీ చేసాము, ”అని రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆంజనేయ కుమార్ సింగ్ పేర్కొన్నారు. రాంపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి ఇప్పటివరకు 33 మందిని అరెస్టు చేశామని, 150 మందికి పైగా ఈ సంఘటనతో సంబంధం ఉందని గుర్తించామని పోలీసులు తెలిపారు.