ఇప్పుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేని ప్రాంతం అంటూ ఏముంది చెప్పండి? చిన్న, చిన్న సిటీల నుంచి మొదలుకొని మహా నగరాల వరకూ అన్ని చోట్ల ఎన్నో అవకాశాలు తెరమీదకు వస్తున్నాయి. సహజంగానే ఇలాంటి అవకాశాలను ఆయా నగరాలు, రాష్ట్రాలకు చెందిన స్థానిక ప్రజలు సొంతం చేసుకోవడంతో పాటుగా.... అవకాశాల కోసం ఆ నగరానికి చేరిన వలస జీవులు కూడా ఉంటారు. ఇలా వలస వెళ్లే వారికి ప్రధానంగా రెండు సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకటి నివాసం, రెండో తమ ప్రాంతం నుంచి నగరానికి- నగరం నుంచి సొంత ప్రాంతానికి వెళ్లే సమయంలో రవాణ సమస్యలు. ఇలా కీలకమైన చెన్నై, ముంబై, నాగపూర్లో నివసిస్తున్న తెలుగువారికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కీలక గుడ్ న్యూస్ చెప్పారు.
తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర రాజధాని ముంబై, ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నైలోని తెలుగువారికి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ గుడ్ న్యూస్ వినిపించారు. హైదరాబాద్లోని వివిధ డిపోల నుంచి నేరుగా చెన్నై, నాగపూర్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఈ రవాణ సదుపాయాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులకు స్పష్టం చేశారు.
తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఇడిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీని కాపాడడానికి, లాభాల బాట పట్టించేందుకు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఉద్యోగులు కూడా తగిన స్పూర్తితో, చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వర్తించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాబోయే పది రోజుల పాటు ఆర్టీసీ ఇడిలు, ఉన్నతాధికారులు డిపోల వారీగా సమావేశాలు నిర్వహించి, ఎక్కడికక్కడ తగిన వ్యూహం రూపొందించాలని చెప్పారు. పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చే విషయంలో సరళమైన విధానం అనుసరించాలని చెప్పారు.