వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అనేక విషయాల్లో దూసుకుపోతున్నారు. కొన్ని విషయాలను వైకాపా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని విజయం సాధిస్తూ వస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత అనేక పధకాలను ప్రవేశపెట్టిన వైకాపా, టీడీపీకి సాధ్యం కానీ ఎన్నో విషయాలపై దృష్టి పెట్టింది. వైకాపా 151 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పింఛన్, విద్యార్థులకు, అలానే ఉద్యోగాల విషయంలో కూడా జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
ఇలాంటి ఎన్నో విషయాలను వైకాపా తీసుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటె, వైకాపా ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తీసుకురావడంతో ప్రజలు షాక్ అయ్యారు. ప్రజలు ఎలా షాక్ అయినప్పటికీ, వాళ్ళకంటే టీడీపీ నాయకులే ఎక్కువగా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా కోస్తా, గుంటూరు, కృష్ణ టీడీపీ నేతలు షాక్ అవుతున్నారు. రాజధాని ప్రాంతంలోని టీడీపీ నేతలు ఈరోజు సమావేశం కాబోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యి రాజధాని మార్పు అంశంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ రాజధాని కోసం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, టీడీపీ కి ఉన్నది కేవలం 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన ఉపయోగం ఉండదు. పైగా ఇప్పుడు టీడీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోతున్నారు. రాజధాని ప్రాంతంలోని టీడీపీ ఎమ్మెల్యేలుగా, ఉత్తరాంద్ర ఎమ్మెల్యేలుగా, రాయలసీమ ఎమ్మెల్యేలుగా చీలిపోతున్నారు.
అటు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు గంట నేపథ్యంలో విశాఖలో సమావేశం జరిపి జగన్ తీసుకున్న విశాఖ కార్యనిర్వాహక రాజధాని అంశం విషయంలో సపోర్ట్ చేస్తే, రాయలసీమకు చెందిన నేతలు కూడా రాయలసీమ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కోస్తా టీడీపీ నేతలు మాత్రం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి వైకాపా షాక్ ఇస్తూ కొన్ని కామెంట్లు చేసింది.
రాజీనామా చేయాల్సింది వైకాపా ఎమ్మెల్యేలు కాదని, టీడీపీ ఎమ్మెల్యేలు అని, ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అమరావతికి సపోర్ట్ చేయాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది వైకాపా కాబట్టి వైకాపా ఎమ్మెల్యేలదే బాధ్యత అని అంటున్నారు. మొత్తానికి మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు మూడు ప్రాంతాల వారిదిగా మారిపోయింది.