భాగ్యనగరంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడపిల్ల రాత్రి వేళ బయటకు వెళ్తే క్షేమంగా వస్తుందన్న భరోసాలేదు. ఆడపిల్లే కాదు.. చిన్నారులు, బాలురు.. వృద్ధులు ఇలా ఎవరికీ గ్యారంటీ లేకుండా పోయింది. ఇప్పుడు మరో దారుణం వెలుగు చూసింది. అదే ఈ కామాంధులు చివరకు హిజ్రాను కూడా వదల్లేదు. ఓ హిజ్రాపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

 

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధి గండిగూడేనికి చెందిన ఓ హిజ్రా భిక్షాటన చేసుకుంటూ పొట్ట పోసుకుంటోంది. ఈ నెల 28న రాత్రి 8 గంటల సమయంలో తన ఇంటికి వెళ్లడానికి బాధితురాలు బాచుపల్లి చౌరస్తాలో నిలబడి ఉంది. మేడ్చల్ జిల్లా మల్లంపేటకు చెందిన మహేష్ అలియాస్ మల్లేష్ యువకుడు.. ఆమెను చూసి కామంతో కుట్రకు తెర తీశాడు.

 

తాను తన ఆటోతో బొల్లారం వైపు వెళ్తున్నట్లు ఆమెను నమ్మించాడు. తనతో రమ్మని చెప్పాడు. నిజమే కాబోలని ఇంటికి వెళ్లొచ్చని భావించిన ఆ హిజ్రా అతని ఆటో ఎక్కింది. దీంతో ఆమెను పెద్దగా జనం లేని ప్రాంతానికి తీసుకెల్లిన మహేశ్..ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె శరీరంతో ఆడుకున్నాడు. అంతే కాదు.. చివరకు ఆమె వద్ద ఉన్న నగదు కూడా లాక్కుని అక్కడే వదిలేశాడు.

 

ఆ తర్వాత అక్కడ నుంచి ఇల్లు చేరుకున్న హిజ్రా.. అదే రోజు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మంగళవారం సాయంత్రం నిందితుడు తన ఆటోతో మల్లంపేట వద్ద బాధితురాలితోపాటు ఇతర బంధువులకు తారసపడ్డాడు. అంతే.. ఇంకేముంది.. అతనిపై వారంతా మూకుమ్మడిగా దాడిచేశారు. అక్కడి నుంచి బాచుపల్లి చౌరస్తాకు తీసుకొచ్చి మరోమారు చితకబాది పోలీసులకు అప్పగించారు.

 

అత్యాచారయత్నం జరిగిన ప్రాంతం ఐడీఏ బొల్లారం రాణా పరిధిలోకి వస్తుందని నిర్ధరించిన పోలీసులు ఫిర్యాదును అక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు ఐడీఏ బొల్లారం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అంటే భాగ్యనగరంలో హిజ్రాలకు కూడా రక్షణ లేదన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: