శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు...తమకు ఇబ్బందిగా మారిన అంశాన్ని అదే రీతిలో ఇరుకున పడేసేందుకు తమదైన శైలిలో షార్ట్కట్లు వెతికే వారు కొందరు ఉంటారు. అయితే, ఇది సామాన్యులకే పరిమితం కాదు...మాన్యులకు సైతం జరుగుతుందని తాజాగా నిరూపించారు ప్రముఖ రచయిత్రి, మేధావి అరుందతీరాయ్. దేశవ్యాప్తంగా కలవరం రేకెత్తిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కొత్త షార్ట్కట్ కనిపెట్టారు.
ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆమె హితబోధ చేశారు. జాతీయ పౌర జాబితాకు (ఎన్నార్సీకి) జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) సమాచార వనరుగా (డేటాబేస్గా) ఉపయోగపడుతుందని, తప్పుడు పేర్లు, చిరునామాలు ఇవ్వడం ద్వారా ఎన్పీఆర్ను వ్యతిరేకించాలని ప్రజలకు సూచించారు. ‘ఎన్పీఆర్ ప్రక్రియ కోసం అధికారులు మీ ఇంటికి వస్తారు. మీ పేరు, ఫోన్ నంబర్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర వివరాలు అడుగుతారు. ఎన్నార్సీకి ఎన్పీఆర్ డేటాబేస్గా ఉపయోగపడుతుంది. దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఇందుకు ఒక ప్రణాళిక ఉన్నది. ఎన్పీఆర్ కోసం అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు.. వేరే పేర్లు, చిరునామాలు చెప్పండి. మనమేమీ లాఠీలు, బుల్లెట్లను ఎదుర్కోవడానికి పుట్టలేదు’ అని సూచించారు.
దేశంలోని ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఎన్నార్సీని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో ముస్లింలపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వారి ఇండ్లలోకి ప్రవేశించి, దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏ, ఎన్నార్సీ కేవలం ముస్లింలకు మాత్రమే వ్యతిరేకం కాదని, దళితులు, గిరిజనులు, పేదలకు కూడా వ్యతిరేకమని అరుంధతిరాయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీపైనా ఆమె విమర్శలు గుప్పించారు. ఎన్నార్సీపై తమ ప్రభుత్వం ఎన్నడూ చర్చించలేదని, అసోంలో ఎలాంటి నిర్బంధ కేంద్రాలు లేవని ప్రధాని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. దొరికిపోతానని తెలిసి కూడా ప్రధాని అబద్ధాలు చెప్పారని, తనను ప్రశ్నించని మీడియా తన చేతుల్లో ఉండడమే ఇందుకు కారణమన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎన్పీఆర్ ద్వారా సీఏఏ, ఎన్నార్సీ నిబంధనలు అమలుచేసేందుకు మోదీ సర్కారు యత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ఎన్నార్సీని, ఎన్పీఆర్ను అమలుచేయబోమని ఆయా రాష్ర్టాలు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు నిరసనకారులు పోరాడాలని ఆమె సూచించారు. అయితే ఎన్నార్సీతో ఎన్పీర్కు ఎలాంటి సంబంధం లేదని, ఎన్పీఆర్ డేటాను ఎన్నార్సీకి ఉపయోగించబోమని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇదివరకే స్పష్టంచేసిన విషయం తెలిసిందే.