ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని.. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు ప్రజాధనం దుబారా చేశారని విమర్శించారు.

 


గత ఐదేళ్లలో లక్షా 95 వేల కోట్ల రూపాయల అప్పుచేసిన చంద్రబాబు.. ఐదు వేల కోట్లు మాత్రమే అమరావతి నిర్మాణానికి ఖర్చు చేశారని మంత్రి అన్నారు. అమరావతిలో ఇప్పటి వరకూ కేవలం రూ. 5,458 కోట్లు ఖర్చు చేశారని.. కేవలం ఒక్క శాతం పనులు మాత్రమే జరిగాయని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అమరావతి నిర్మాణం సాధ్యం కాదన్నారు. అమరావతి ప్రజలను చంద్రబాబు దగా చేశారని మంత్రి బొత్స మండిపడ్డారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికలో అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌ గా తీర్చిదిద్దాలని సూచించారని.. ఆ దిశగా ప్రభుత్వం యోచిస్తుందన్నారు. 

 


అలాగే ఐటీ హబ్‌గా చేయాలని డిమాండ్లు వస్తున్నాయని.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. యాభై శాతానికి పైగా పూర్తయిన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే అసెంబ్లీలోనే ప్రకటించామని గుర్తు చేశారు. అమరావతిలో భవనాల వినియోగం తదితర విషయాలపై కూడా క్యాబినెట్ సమావేశం అనంతరం స్పష్టత వస్తుందన్నారు.

 


మూడు రాజధానుల వ్యవహారంపై మంత్రి బొత్స ఆచితూచి సమాధానమిచ్చారు. ఏపీ రాజధాని ఎక్కడ ఉంటుందనే విషయంపై క్యాబినెట్ సమావేశం అనంతరం స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. ఏపీ రాజధాని ఎక్కడ అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేశారు. రాజధాని ఎక్కడో ఎల్లుండి చెబుతామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: