సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిపాలన వికేంద్రీకరణ అవసరమని చెప్పినట్లు  తెలిపారు.  విజయనగరంలో బుదవారం నిర్వహించిన సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి   స్వార్థపూరిత రాజకీయాలే ఆయన  నైజమని రాజన్న దొర దుయ్యబట్టారు.టీడీపీ అధినేత చంద్రబాబు  కృష్ణా, గుంటూరు మాత్రమే అభివృద్ధి చెందాలని  భావిస్తున్నారని, అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే నిరంతరం ధర్నాలకు దిగుతున్నారని మండిపడ్డారు.


తమ పాలనలో చాళుక్యులు, శాతకర్ణులు   రాజధానులు మార్చిన చరిత్ర బాబు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేవలం 29 గ్రామాల కోసం​అత్యంత వెనుకబడిన జిల్లాలకు రాజధాని ఇవ్వడం తప్పా అంటూ రాజన్న నిలదీశారు. టీడీపీ నేతలు కుప్పిగంతులేయడమే తప్ప విశాఖపట్నం  రాజధానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. జయప్రకాశ్‌ నారాయణ్‌, వెంకయ్యనాయుడు వంటి నేతలే వికేంద్రికరణపై మద్దతు ఇస్తుంటే.. చంద్రబాబు రాద్దాంతం చేస్తుండడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై దర్యాప్తు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.చంద్రబాబు ఇప్పటికైనా తన స్వార్ధ బుద్ధిని వదిలి ప్రజల  అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన తెలిపారు .

 

విశాఖ రాజధాని ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం అంటూ నాయకులు ఆహ్వానించారు .దశాబ్ధాల తరబడి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వెనకబడిందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతోనే  ప్రజలందరికి న్యాయం జరగాలన్న ముఖ్య ఉద్దేశంతో  మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య కూడా తెలిపారు. 

 

అంతేకాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపై  విషయంపై జగన్‌కు స్పష్టత ఉందని , జీఎన్‌ రావు కమిటి ఇచ్చిన నివేదికను యధావిధిగా అమలు చేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వికేంద్రికరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, విశాఖను రాజధానిగా ప్రకటించడంపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే, ఎంపీలంతా ముక్తకంఠంతో మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, హైకోర్టు బెంచ్‌లు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: