ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే. మొదట కుటుంబానికి మంచి చేసుకొని తరువాత బయట నాయకుల గురించి ఆలోచిస్తారు. అందులోను తమకు అనుకూలంగా ఉండే వాళ్లకు పదవులు అప్పగిస్తారు అనే విషయం అందరికి తెలుసు. 2014లో నిజామాబాద్ జిల్లాలో తెరాస పార్టీ మంచి విజయాలు దక్కించుకుంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో కూడా తెరాస పార్టీ నిజామాబాద్ నుంచి విజయం సాధించింది.
అయితే, 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేసింది. అంతకు ముందు కూడా కవిత నిజామాబాద్ నుంచే విజయం సాధించి పార్లమెంట్ కు వెళ్ళింది. పార్లమెంట్ లో తన వాయిస్ ను వినిపించింది. కానీ, నిజామాబాద్ లో రైతుల సమస్యలను తీర్చడంలో మాత్రం కవిత వెనుకబడిపోయింది. దీంతో నిజామాబాద్ ప్రజలు ఆమెపై కోపాన్ని ప్రదర్శించారు. పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిన కవిత దానికి తీసుకురాలేకపోయే సరికి, 2019 ఎన్నికల్లో కవిత ఓడిపోయింది.
కెసిఆర్ కూతురు నిజామాబాద్ నుంచి ఓటమి పాలవ్వడంతో అప్పటి నుంచి రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. హుజూర్ నగర్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకున్నా ఆమె అందుకు నో చెప్పింది. ఇటీవలే తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో మోడీపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేయడంతో ఆమె మరలా క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారని అర్ధం అయ్యింది.
2020 లో ఆమెను కెసిఆర్ పెద్దల సభకు పంపించే యోచనలో ఉన్నారు. 2020లో తెరాస ముఖ్యనాయకుడు కెకె పదవీకాలం ముగియనున్నది. ఈ పదవీకాలం ముగియనుండటంతో... కెకె స్థానంలో కవితను రాజ్యసభకు పంపాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. కవిత అయితే వాణిని బలంగా వినిపిస్తోందని కెసిఆర్ అంటున్నారు. మరి కెసిఆర్ కూతురి కోసం కెకె తన స్థానాన్ని త్యాగం చేస్తారా ? చూడాలి. ఒకవేళ కెకె వంటి సీనియర్ లీడర్ని పక్కన పెట్టి కవితను రాజ్యసభకు పంపితే కుటుంబపార్టీగా మరోసారి ప్రజలు అనుమానించే అవకాశం ఉన్నది. మరి ఈ విషయంలో కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.