ఒంటరి ఆడాళ్లను గుర్తించడం.. వాళ్లను మత్తులో దింపడం.. మాటల్లో పెట్టి జనం లేని ప్లేసులకు తీసుకెళ్లడం .. ఆ తర్వాత చంపేయడం.. ఇదీ అతని నేర ప్రవృత్తి. ఇలా ఒకరిని కాదు. ఇద్దరిని కాదు. ఏకంగా 16 మందిని ఇలా చంపేశాడు.. ఇలా చంపేది దేని కోసమే తెలిస్తే మీరు షాకవ్వక తప్పదు.. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు శివారులో అలివేలమ్మ అనే మహిళ ఈ నెల 16న హత్యకు గురైంది. బాలనగర్ మండలం గుండేడ్‌కు చెందిన ఎరుకలి శ్రీను ఈ హత్యచేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

 

నిందితుడు గతంలో ఇదే కోణంలో చాలా హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీను మహిళల ఒంటిమీదున్న నగలే లక్ష్యంగా ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. భూత్పూర్ మండలం కరివెన శివారులో బాలమ్మ అనే మహిళ, కొత్తకోట మండలం అప్పరాలలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. డిసెంబర్ 14రంగారెడ్డి జిల్లా అబ్బుల్లాపూర్ మెట్ లో ఓ మహిళ ఎముకల గూడు దర్శనమిచ్చింది. దేవరకద్ర మండలం డోకూరులో జరిగిన మహిళ హత్య కేసు నిందితుడే ఈ నాలుగు హత్యలూ చేసినట్లు తేలింది.

 

కొత్త వారినే కాదు.. సొంత తమ్ముడు, అత్త నే కాదు.. మరో 13 హత్య కేసుల్లో ఎరుకలి శీను నిందితుడు. మూడు కేసుల్లో నేరం రుజువైంది కూడా. మిగిలిన కేసులు దర్యాప్తులో ఉన్నాయి. గతంలో మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఏడు హత్యలు చేసినట్లుగా తెలుస్తోంది. షాద్‌నగర్, శంషాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

 

2007తమ్ముడి హత్యకేసులో ఎరుకలి శ్రీను జైలుకెళ్లాడు. సత్ప్రవర్తన కింద అప్పీలు చేసుకొని శిక్షకాలానికి ముందే జైలు నుంచి బయటకు వచ్చాడు. బయటకి రాగానే మళ్లీ నేరాలు మొదలు పెట్టాడు. తాజాగా జరిగిన హత్యకేసుల్లో అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు.... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితోపాటు హత్యతో సంబంధమున్న అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: