తెలుగుదేశం పార్టీపై బలమైన ఆరోపణలు చేసింది వైకాపా ప్రభుత్వం. అమరావతిలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ఇప్పటికే చెప్పిన వైకాపా, బోస్టన్ గ్రూప్ నివేదిక వచ్చిన తరువాత హైలెవల్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని అంటోంది. అయితే, అమరావతిలో మాత్రం సాధ్యం కాదని, లక్షకోట్ల రూపాయలను అమరావతి కోసం ఇప్పుడు ఖర్చు పెట్టలేమని అంటోంది. అయితే, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైకాపా ఆరోపిస్తుంది తప్ప అధరాలు లేవని టీడీపీ చెప్తోంది.
ఇలా టీడీపీ మాట్లాడిన కాసేపటికే ఇన్సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ లో టీడీపీ నాయకులకు సంబంధించిన లిస్ట్ ను బహిర్గతం చేశారు. రాజధానిలో 4వేల ఎకరాల భూమిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొన్నది. వాటికి సంబంధించిన వివరాలను, బినామీల లిస్ట్ ను బయటపెట్టింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకొని ఎవరి చేత విచారణ జరిపించాలో నిర్ణయిస్తామని అంటోంది.
నిపుణుల సలహాలు సూచనలు ఎందుకు ల్యాండ్ కు సంబందించిన చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని, నిజంగా భూమి కొనుగోలు జరిగిందా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవచ్చని, ఒకవేళ తెలుగుదేశం పార్టీ నేతల పేర్లపై భూములు ఉంటె దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధంగా ఉన్నామని అంటోంది తెలుగుదేశం పార్టీ. జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 మధ్య తెలుగుదేశం పార్టీ బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు స్నేహితుడైన లింగమనేని రమేష్ బినామీ పేర్లతో భారీగా భూమిని కొనుగోలు చేశారు. అలానే మాజీ మంత్రి నారాయణ వద్ద పనిచేసే కొందరు కూడా భూమిని కొనుగోలు చేసినట్టుగా నివేదిక పేర్కొన్నది. ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరిట 38.84 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అలానే మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తన బినామీ సంస్థ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టు నివేదిలలో పేర్కొన్నారు.
నారా లోకేష్కు సన్నిహితుడైన వేమూరు రవికుమార్ ప్రసాద్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోష్పాద గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ ట్రెండ్స్ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్ పేరిట 62.77 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వీరితో పాటుగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బినామీలు కూడా భూములు కొనుగోలు చేసినట్టు నివేదిలలో స్పష్టం చేశారు. ఆధారాలతో సహా ఈ నివేదిక బయటకు రావడంతో న్యాయపరంగా అడ్డుకోవడానికి టిడిపి సిద్ధం అవుతున్నది.