ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యతిరేక శక్తులు ఒకే వేదికపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ విషయంలో విపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. అయితే, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో...ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను 2020, జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నిర్వహించే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆప్ ఓ సభ నిర్వహించింది. ఈ సభలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. భవిష్యత్లో కేజ్రివాల్ ప్రధాన మంత్రి అవుతారని ఆశిస్తున్నానని ఓ వృద్ధురాలు పేర్కొంది.
ఆప్ నిర్వహించిన ఈ సభకు వచ్చిన ఓ వృద్ధురాలు వేదికపై వెళ్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ... `అరవింద్ కేజ్రీవాల్ను ఎప్పట్నుంచో కలవాలి అనుకుంటున్నాను. ఆయనకు నా దీవెనలు ఇవ్వాలని కోరుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాబోయే రోజుల్లో ప్రధాన మంత్రి అవుతారని ఆశిస్తున్నట్లు వృద్ధురాలు చెప్పింది. మంచి పనులు చేసిన వారందరికీ అరవింద్ లాంటి కొడుకు లభిస్తాడు` అని ఆమె అభిప్రాయపడింది. చివరగా కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ వృద్ధురాలు నినదించింది.
అయితే, ఆసక్తికరమైన సందర్భంగా వృద్ధురాలికి సీఎం కేజ్రీవాల్ పాదాభివందనం చేశారు. ఈ ఘటన గురించి కేజ్రివాల్ పంచుకుంటూ...ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వృద్ధురాలు మాట్లాడిన వీడియోను కేజ్రీవాల్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. కాగా, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామన్న భయంతోనే ఢిల్లీలో హింసను ప్రేరేపిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై స్పందిస్తూ అల్లర్ల వెనుక ఎవరున్నారో వారికి 2015 అసెంబ్లీ ఎన్నికల వలే గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, సీలంపూర్ లో హింసాత్మక ఘటనలు జరిగేలా విద్యార్థులను ప్రేరేపించారని ఆమ్ ఆద్మీపార్టీపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు.