రూ. 5 తో అన్నం పెట్టడం చేతకాక అన్నక్యాంటీన్లు ఎత్తివేసి పేదల కడుపు కొట్టిన వైసీపీ ప్రభుత్వం.. 3 రాజధానులు నిర్మిస్తానంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ నేతలకు చేతనైతే ముందు అన్న క్యాంటీన్లు తెరిచి ఆ తర్వాత 3 రాజధానుల గురించి మాట్లాడాలని టీడీపీ నేత మంతెన సత్యన్నారాయణ రాజు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో వేల ఎకరాల భూములు కబ్జా చేసిన అవంతి, వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ది చెందటం చంద్రబాబు ఇష్టం లేదా అని అవంతి అంటున్నారు.
చంద్రబాబు హయాంలో విశాఖ నగరంతోపాటు ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ది ఆయన కళ్లకు కన్పించటం లేదా? వేలాది మందికి ఉపాధినివ్వాల్సిన అదానీ, లులూ సహా అనేక మందికి ఉపాధినిచ్చే కంపెనీలను జగన్ తన స్వార్ధ రాజకీయాల కోసం తరిమేసినప్పుడు అవంతి శ్రీనివాసరావుకు ఉత్తరాంధ్ర అభివృద్ది గుర్తుకు రాలేదా? పులి అహింసా జంతువుగా మారదు అన్నది ఎంత నిజమో..జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ది కారకుడిగా మారడు అన్నది అంతే నిజం.
విశాఖలో వైసీపీ 6 నెలల పాలనలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్, భూకజ్జాల బాగోతం ప్రజలకు తెలుస్తుందనే ముఖ్యమంత్రి జగన్ నిన్న విశాఖ ఉత్సవ్లో ప్రసంగించకుండా వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడితే..వైసీపీ నేతల భూకజ్జాలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రజలు నిలదీస్తారనే భయంతోనే జగన్ మాట్లాడలేదు.
గొర్రె తోక బెత్తెడు అనే విధంగా అవంతి శ్రీనివాస్ ఆలోచనలున్నాయి. మంత్రిగా విశాఖ అభివృద్ధికి కృషి చేయకుండా.. అల్లర్లు సృష్టించి కబ్జాలు, బెదిరింపులతో నగరంలో అలజడి తెచ్చిన జగన్మోహన్ రెడ్డికి తన విద్యార్థులతో రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. అసలు జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరానికి ఏం చేశారని స్వాగత హారాలు ఏర్పాటు చేయించారో మంత్రి అవంతి ఆత్మ విమర్శ చేసుకోవాలని మంతెన పేర్కొన్నారు.
అయితే, రాజాధాని విషయంలో టీడీపీ వాదన ఒకలా ఉంటె, వైకాపా వాదన మరోలా ఉన్నది. ఎవరివారు విమర్శలు చేసుకుంటూ... వాదోపవాదాలు చేసుకుంటూ అభివృద్ధిని పక్కన పెడుతున్నారు. ఇలానే ఇంకొన్నాళ్ళు జరిగితే అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు తరలిపోయాయి. ఇంకొన్ని కూడా తరలిపోయే అవకాశం ఉంటుంది. రాజధాని గురించి ఏపీ లో గందరగోళం జరిగితే అది హైదరాబాద్ కు లబ్ది చేకూరుతుంది.