కొత్త సంవత్సరం అంటే ఎవరికైనా కొత్త ఆలోచనలు, అభిప్రాయాలు...ప్రణాళికలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం, డబ్బుల విషయంలో వేసుకునే ప్రణాళికలు ప్రత్యేకమే. ఆర్థికంగా నూతన సంవత్సరంలో మేలు కలిగే పనులు చేయాలని ఎవరైనా అనుకుంటారు. అలా అనుకునే సమయంలోనే ఊహించని తీపి కబురు వస్తే సంతోషమే కదా?. తాజాగా అదే జరుగుతోంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా, జనవరి 1 నుంచి రూపే, యూపీఐ చెల్లింపులకు వర్తింపులు ఉండవని తెలిపింది. దీనివల్ల కొనుగోలుదారులకు, వ్యాపారులకు లాభం జరగనుంది.
తమ దుకాణాల్లో కొన్న వస్తువులు, పొందిన సేవల కోసం చెల్లింపులకుగాను కస్టమర్లు వినియోగించే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను అనుమతించినందుకుగాను బ్యాంకులకు వ్యాపారులు చెల్లించేవే ఎండీఆర్ చార్జీలు. లావాదేవీల ఆధారంగా ఈ చార్జీలుంటాయి. ఇక క్రెడిట్ కార్డు లావాదేవీలపై 0 నుంచి 2 శాతం వరకు ఎండీఆర్ చార్జీలు.. బ్యాంకులు, వ్యాపారులు, కార్డు కంపెనీల మధ్య పంపిణీ అవుతాయి. అయితే, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా, జనవరి 1 నుంచి రూపే, యూపీఐ చెల్లింపులకు వర్తింపులు ఉండవని తెలిపింది. దీనివల్ల కొనుగోలుదారులకు, వ్యాపారులకు లాభం జరగనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులు, ప్రైవేట్ రంగ బ్యాంకుల సారథులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ వ్యాపారులు, వినియోగదారులు ఇంకెంతో కాలం ఎండీఆర్ చార్జీలను భరించనవసరం లేదన్నారు. జనవరి 1 నుంచి వీటిని ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేశారు. రూపే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీలకు ఎండీఆర్ చార్జీలు వర్తించవని పేర్కొన్నారు. ఈ మేరకు రెవిన్యూ శాఖ త్వరలోనే ఓ అధికారిక ప్రకటన చేస్తుందని వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకులు ఈ భారాన్ని భరిస్తాయన్నారు. త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రోత్సహించేలా అన్ని బ్యాంకులు.. రూపే డెబిట్ కార్డులు, యూపీఐకి ప్రాచూర్యాన్ని కల్పించే చర్యలు చేపడుతాయన్నారు. కాగా, ఈ నిర్ణయం దేశంలో ఆన్లైన్ లావాదేవీలను భారీగా ప్రోత్సహించనున్నది. రూ.50 కోట్లు అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న అన్ని సంస్థలు.. రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్కోడ్ ద్వారా తమ కస్టమర్లకు చెల్లింపుల వెసులుబాటును కల్పించాలని, దీనివల్ల ఇటు కొనుగోలుదారులు, అటు వ్యాపారులు ఎండీఆర్ చార్జీల నుంచి మినహాయింపు పొందవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘భాగస్వాములు, బ్యాంకులతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాం. ఈ ప్రకటనను చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. రూపే, యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై జనవరి 1, 2020 నుంచి ఎండీఆర్ చార్జీలు లేవు’ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను జూలైలో పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లో ఈ చార్జీల ఎత్తివేతను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. చౌకగా లభించే భీమ్ యూపీఐ, యూపీఐ క్యూఆర్ కోడ్, ఆధార్ పే, డెబిట్ కార్డులు, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ విధానాలను తమ కస్టమర్లకు వ్యాపారులు అందుబాటులోకి తేవాలని నాడు నిర్మల అన్నారు.