పెద్దనోట్ల రద్దు గుర్తుండే ఉంది కదా? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...ఆకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ దాదాపు మూడేళ్ల కిందట తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎందరినో అష్టకష్టాల పాలయ్యేలా చేసింది. కొందరు ప్రాణాలు కోల్పోయేందుకు కారణం అయింది. నల్లధనం రూపుమాపేందుకు తీసుకున్న నిర్ణయం అంటూ సర్కారు ప్రచారం చేసినప్పటికీ...ఆ మేరకు ప్రయోజనం మాత్రం దక్కలేదు. అనేక మందికి ఊహించని కష్టాలు రుచి చూపించిన ఈ సంచలన నిర్ణయం మరో రూపంలో మళ్లీ తెరమీదకు వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మళ్లీ ఈ తరహా నిర్ణయం తీసుకున్నారట. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ మేరకు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ 130వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయా రాష్ర్టాల రాజధానుల్లో ‘దేశాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి’ అంటూ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. -ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఏకే ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, 1885లో కాంగ్రెస్ ఆవిర్భావానికి బీజం పడిన మహారాష్ట్రలోని క్రాంతిమైదాన్ సమీపంలోఉన్న తేజ్పాల్ హాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు.
సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న అసోం, ఉత్తరప్రదేశ్లలో నిర్వహించిన ర్యాలీల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ పాల్గొన్నారు. అసోం ప్రజల సంస్కృతి, గుర్తింపుపై బీజేపీ, ఆరెస్సెస్ దాడిని అనుమతించబోమన్నారు. అసోంలో ఆరెస్సెస్ చెడ్డీవాలా పాలన సాగబోదన్నారు. ఆందోళన సందర్భంగా రాష్ట్రంలో ఐదుగురు మృత్యువాతపడడం బాధాకరమని, ఆ కుటుంబాలను తాము పరామర్శిస్తానని పేర్కొన్నారు.
స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేనివారు (ఆరెస్సెస్ను ఉద్దేశించి) జాతీయవాదం పేరిట ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నార్సీ, ఎన్పీఆర్ను నోట్లరద్దు-2గా అభివర్ణించిన రాహుల్గాంధీ.. అవి నోట్ల రద్దు కంటే విపత్కరమైనవని ధ్వజమెత్తారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ విధానాలతో అసోం మళ్లీ హింసామార్గం వైపు మళ్లే ప్రమాదం తలెత్తిందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న యువతపై కాల్పులు జరుపడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. దేశంలో బీజేపీ ఎక్కడ అడుగపెట్టినా అక్కడ విద్వేషం, హింస, ప్రజల మధ్య చిచ్చు నెలకొంటాయని ధ్వజమెత్తారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని ప్రధాని మోదీ చెప్పారని, కానీ అందుకు బదులుగా తన మిత్రులైన పారిశ్రామిక వేత్తలకు రూ.3.5 లక్షల కోట్లు కట్టబెట్టారన్నారు.