నేటి సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కనీసం వావివరుసలు మరచి ఒకరినొకరు చంపుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులని  కూడా చూడకుండా కొడుకులు అతి దారుణంగా హతమార్చడం... పేగు  తెంచుకుని పుట్టిన బిడ్డలు  అని చూడకుండా కన్న తల్లి బిడ్డలను అతి కిరాతకంగా హత్య చేయడం లాంటివి రోజుకోటి  తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో మనిషి ప్రాణాలకు లెక్క లేకుండా పోయింది. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. తల్లిదండ్రులపై దారుణంగా కత్తితో దాడి చేయడానికి యత్నించిన తమ్ముని అన్న అదే కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల జిల్లా కన్నాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా కన్నాపూర్ కు  చెందిన పొట్టవత్తిని గంగారం రాజేశ్వరి లకు  చిన్న కుమారుడు శివ కుమార్,పెద్ద కుమారుడు సతీష్ ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్   హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండే వాడు. అయితే శివకుమార్ మానసిక పరిస్థితి బాగాలేక తరచూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆదివారం శివ కుమార్ ఖానాపూర్ వచ్చాడు. తన తల్లిదండ్రుల పై కత్తితో దాడికి ప్రయత్నించాడు శివకుమార్. ఇక తన చిన్న కుమారుడు దాడితో హడలిపోయిన తల్లిదండ్రులు సమీప అటవీ ప్రాంతం లోకి వెళ్లి తలదాచుకున్నారు. సాయంత్రం వరకు భయంతో అక్కడే ఉండి పోయిన తల్లిదండ్రులు రాత్రి అవుతుండడంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు. 

 

 

 

 అయితే రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో శివ కుమార్ మళ్లీ ఇంటికి వచ్చి తల్లిదండ్రుల పై కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు. అయితే వెంటనే అలెర్ట్ అయిన  తన సోదరుడు సతీష్ శివ కుమార్ ను  అడ్డుకున్నాడు. దీంతో శివ కుమార్ అన్న సతీష్ పై కూడా కత్తితో దాడి చేసేందుకు వెనకాడలేదు. శివ  కుమార్ కత్తితో దాడి చేస్తున్న సమయంలో అప్రమత్తమైన సతీష్ శివకుమార్ నుంచి కత్తిని లాక్కుని ఆ కత్తితోనే శివ కుమార్ పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో... శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక తమ్ముని హత్య చేసిన అన్న సతీష్ జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో  లొంగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: