తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 131 మున్సిపాలిటీల్లో 3,149 వార్డులు ఖరారయ్యాయి. వార్డుల విభజన ప్రక్రియ పూర్తి కావడంతో వాటికి ఎన్నికల నిర్వహణకు ఇటు నాయకులు అటు అధికారులు సర్వ సన్నద్ధంగా ఉన్నారు. అయితే, ఈ ఎన్నికల విషయంలో పలు ముఖ్యమైన అంశాలు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది.
- పురపాలక, నగరపాలక సంస్థలో ఓటరుగా ఉన్న వ్యక్తి మాత్రమే వార్డు, డివిజన్ సభ్యుడిగా పోటీ చేసేందుకు అర్హత కలిగి ఉంటారు.
- 21 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారు అర్హులు.
- -నాలుగు కంటే ఎక్కువ నామినేషన్లు వేయకూడదు. ప్రతి నామినేషన్ పత్రంపై సంబంధిత వార్డు నుంచి ఒక ఓటరు ప్రతిపాదకుడిగా సంతకం చేయాలి.
- ఒక అభ్యర్థి ఒకటికంటే ఎక్కువ వార్డుల్లో పోటీ చేయకూడదు. వేర్వేరు వార్డుల్లో నామినేషన్లను దాఖలు చేసినా ఒక వార్డులో మినహా ఇతర నామినేషన్లను ఉపసంహరించుకోవాలి. రెండు అంతకంటే ఎక్కువ వార్డుల్లో పోటీలో ఉంటే పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు.
- కార్పొరేషన్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు..రూ.2,500, ఇతరులు రూ.5,000 డిపాజిట్ చేయాల్సి ఉండగా.. పురపాలక సంఘాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250.. ఇతరులు రూ.2,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంది.
- అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి మాత్రం ఆ వార్డులో ఓటరై ఉండాలి.
- మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు కావడం వల్ల.. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 3,352 పదవుల్లో సగం 1,676 పదవులు మహిళలను వరించనున్నాయి
- వార్డులవారీగా ప్రతి 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని కేటాయించే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత బీసీ ఓటర్ల జాబితాను ఖరారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు. దీనిపై ప్రభుత్వం ఆమోదముద్ర వేశాకే బీసీ రిజర్వేషన్లు ఖరారవుతాయి.
-ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన డిక్లరేషన్ విధిగా జత చేయాలి.
- కాగా, పోటీ చేసే వారి విషయంలో కఠిన నిబంధనలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్గా ఉన్నా, మున్సిపల్ ఆస్తులను లీజులు తీసుకోవడం, బకాయిలు ఉండటం, దివాలా తీసిన (అప్పు తీర్చలేని) వ్యక్తిగా ప్రకటించబడిన వారు. మున్సిపాలిటీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవులు చేపట్టిన వారు అనర్హులని స్పష్టం చేశారు.